Manjima Mohan: పెళ్లిలోను నన్ను బాడీ షేమింగ్ చేశారు
ABN , First Publish Date - 2022-12-01T22:22:23+05:30 IST
హీరోయిన్ మంజిమా మోహన్ (Manjima Mohan), హీరో గౌతమ్ కార్తిక్ (Gautham Karthik) ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్ మంజిమా మోహన్ (Manjima Mohan), హీరో గౌతమ్ కార్తిక్ (Gautham Karthik) ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. వివాహం అనంతరం మంజిమా తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రేమ, పెళ్లి, కెరీర్ వంటి విషయాలపై అభిప్రాయాలను పంచుకుంది. మంజిమా మోహన్ను గతంలో కొంత మంది నెటిజన్స్ బాడీ షేమింగ్ చేసేవారు. అసభ్య పదజాలంతో దూషించేవారు. ఈ కామెంట్స్పై తన అభిప్రాయాన్ని మంజిమా తెలిపింది. అటువంటి కామెంట్స్ తనను ఏమీ చేయలేవని రిప్లై ఇచ్చింది.
‘‘మా పెళ్లికి వచ్చిన కొంత మంది కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు. గతంలో ఇటువంటి వాటితో నేను బాధపడేదానిని. ప్రస్తుతం మాత్రం అటువంటి సమస్య ఏం లేదు. నా బాడీని నేను ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువును తగ్గించుకోగలను. నేను ఫిట్గా సంతోషంగా ఉన్నాను. ఏ పాత్ర కోసమైనా బరువును తగ్గించుకోవాల్సి వస్తే నేను తప్పకుండా ఆ పని చేస్తాను’’ అని మంజిమా మోహన్ చెప్పింది. మంజిమా మోహన్, గౌతమ్ కార్తిక్ కలసి ‘దేవరట్టం’ సినిమా చేశారు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, వీరిద్దరూ మూడేళ్ల పాటు సహజీవం చేశారంటూ గతంలో వార్తలొచ్చాయి. ఈ వార్తలపై కూడా మంజిమా స్పందించింది. ‘‘లాక్డౌన్ విధించనప్పుడు నేను కుటుంబానికి దూరంగా ఒంటరిగా చెన్నైలో ఉన్నాను. గౌతమ్ వాళ్లింట్లో ఉండేవాడు. మేమిద్దరం స్నేహితులం కావడంతో అప్పుడప్పుడు బయటకు వెళ్లేవాళ్లం. ఫలితంగా మేం సహజీవనం చేస్తున్నామంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. మేమిద్దరం డేటింగ్ చేయలేదు’’ అని ఆమె చెప్పింది.