Manchu Vishnu: సడెన్గా ఈ వ్యాఖ్యలేంటి? ఇక అది కల్లేనా?
ABN , First Publish Date - 2022-09-28T21:44:04+05:30 IST
మంచు విష్ణు కొత్త వరవడికి నాంది పలికారు. తన తాజా చిత్రం ‘జిన్నా’ (Ginna) ప్రమోషన్స్ను ట్రోలర్స్ – మీమర్స్తో ప్రారంభించారు. మంగళవారం ఈ మేరకు ఓ వేదికపై ఆయన మీమర్స్..
కొత్త మీడియాకు విష్ణు నాంది
టార్గెట్ చేసి ట్రోల్ చేయించే హీరో ఎవరు?
శుక్రవారం మీట్లో ఆ హీరో పేరు చెబుతారా?
‘మా’పై ఏడాదికే విసుగు పుట్టిందా?
‘మా’ భవంతి కల నెరవేరుతుందా?
మంచు విష్ణు (Manchu Vishnu) వ్యాఖ్యలపై చర్చలు!
మంచు విష్ణు కొత్త వరవడికి నాంది పలికారు. తన తాజా చిత్రం ‘జిన్నా’ (Ginna) ప్రమోషన్స్ను ట్రోలర్స్ – మీమర్స్తో ప్రారంభించారు. మంగళవారం ఈ మేరకు ఓ వేదికపై ఆయన మీమర్స్ –ట్రోలర్స్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ప్రమోషన్ అనేది మీడియా వారిని పిలిచి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ప్రమోషన్స్ మొదలుపెడతాం. అది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు కాలం మారుతోంది. మీడియా రీచ్ మారుతుంది. దానికి మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రస్తుత సమయంలో యూట్యూబ్ అనేది పవర్ఫుల్ ప్లాట్ఫామ్గా మారింది. సోషల్ మీడియా అనేది కొత్తతరహా మీడియాకు నాంది పలికింది. అందుకే ఈ కొత్త మీడియాను కలవడానికి కొత్త స్టెప్ తీసుకున్నాను’’ అని మంచు విష్ణు ఆ వేదికపై చెప్పారు. అయితే మంచు విష్ణు తీసుకున్న ఈ స్టెప్కు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. (Manchu Vishnu Comments)
ఇదే ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని జూబ్లీహిల్స్లో చెక్పోస్ట్ సమీపంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో 18 మంది ఉద్యోగులు తమను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారనీ, సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయగా వారు ఆధారాలు, ఐపీ అడ్రస్ సేకరించి ఆ ఆఫీసు ఉన్న అడ్రస్ ఓ నటుడి ఆఫీస్ అని తేల్చి చెప్పారని, త్వరలోనే ఆ విషయాలు బయటకు వస్తాయని విష్ణు వివరించారు.
ఆ హీరో ఎవరు? విష్ణు చెబుతారా?
అయితే ఆ హీరో (Hero) ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి విష్ణు ఈ హీరో పేరు బయటపెడతారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే మరోసారి ట్రోలింగ్ కూడా మొదలైంది. ‘ఎవరు ఆ హీరో.. అంత టార్గెట్ చేసి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అతనెవరో తెలియాలి..’ అంటూ విష్ణుని అభిమానించే వారు పోస్ట్లు పెడుతున్నారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేయబోయే ప్రెస్మీట్లో ఆ నటుడి పేరు బయటపెడతారా? అన్నది చూడాలి.
‘మా’ బిల్డింగ్ పరిస్థితి ఏంటి?
అక్టోబర్ పదో తేదీకి మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడి పదవీ బాధ్యతలు తీసుకుని ఏడాది కానున్న నేపథ్యంలో ఆ రోజున ప్రెస్మీట్ పెట్టి ‘మా’కు సంబంధించి ఏడాది కాలంలో ఏం చేశాం.. ఏం సాధించాం అన్న విషయాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ‘మా’కు సంబంధించి విష్ణు చేసిన మరో కీలక వ్యాఖ్య ఇప్పుడు దూమారం లేపుతోంది. ఆయన ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించి ఏడాది గడిచిందో లేదో.. ఇక భవిష్యత్లో ‘మా’ ఎన్నికల్లోనే కాదు.. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రకటించారు. జనరల్ ఎలక్షన్స్ను తలదన్నెలా జరిగిన ‘మా’ ఎన్నికల గురించి ఏడాది కాలంలో విష్ణు ఇలా మాట్లాడటమేంటి? అన్న చర్చ కూడా మొదలైంది. ఏడాదికే ‘మా’ పదవిపై విసుగు పుట్టిందా? మరి సొంత డబ్బుతో కట్టిస్తానన్న ‘మా’ భవంతి సంగతి ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు మ్యానిఫెస్టోలో ‘మా’ సభ్యుల కోసం ఎన్నో హామీలిచ్చారు. వాటి సంగతి ఏంటన్నా? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. 25 ఏళ్లుగా ఒక్క ఇంచు కూడా కదలని ‘మా’ భవనం (Maa Building) విషయంలో.. సొంతంగా నిర్మిస్తానని దానికి సంబంధించి ఇప్పటికే వర్క్ మొదలుపెట్టామని విష్ణు పలు వేదికలపై చెప్పారు. దీంతో అందరూ విష్ణు ఎలాగైనా ‘మా’ భవనాన్ని సాధించే తీరతారని నమ్మారు. తాజా ప్రకటనతో టాలీవుడ్ అంతా షాక్ తింది. వచ్చే నెల పదో తేదీ నుంచి మరో ఏడాది మాత్రమే మంచు విష్ణుకు పదవీ కాలం ఉంటుంది. ఈ ఏడాదిలో ‘మా’ భవంతి ప్రారంభించడం సాధ్యమేనా? పైగా ఆయన ‘మా’ కాదు కదా ఏ ఎన్నికల్లోనూ మళ్లీ పోటీ చేయను.. అని అనడంతో కొత్త రూమర్లు పుట్టకొస్తున్నాయి. విష్ణు హయాంలో అయినా ‘మా’ భవంతి కల నెరవేరుతుందా? అసోసియేషన్కి మంచి జరుగుతుందా? అని ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. మరి పదో తేదిన జరగబోయే మీట్లో మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.