Aryan Khan నాకు ఓ నెంబర్ ఇచ్చాడు.. ఫోన్ చేశాను కానీ.. అసలేం జరిగిందో నోరు విప్పిన Kiran Gosavi
ABN , First Publish Date - 2021-10-26T18:56:03+05:30 IST
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై సంచలన ఆరోపణలు తెర పైకి వస్తున్నాయి. అతడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్సీబీ తరఫున సాక్షిగా ఉన్న కిరణ్ గోసావి అనే వ్యక్తి బాడీగార్డ్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. శామ్ డిసౌజా అనే వ్యక్తితో కిరణ్ ఫోన్లో మాట్లాడుతూ.. షారూక్ను రూ.25 కోట్లు డిమాండ్ చేయాల్సిందిగా చెప్పడాన్ని తాను విన్నానని, చివరకు 18 కోట్లుకు డీల్ సెటిల్ అయిందని చెప్పాడు. అందులో సమీర్ వాంఖడేకు రూ.8 కోట్లు ఇవ్వాలని కిరణ్ చెప్పడం తాను విన్నానని చెప్పాడు.
ఆర్యన్ చేత కిరణ్ ఫోన్ మాట్లాడిస్తున్నట్టు ఉన్న వీడియో బయటకు రావడంతో వాంఖడేపై అనుమానాలు తలెత్తాయి. వాంఖడేపై దర్యాఫ్తు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఆ రోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని తాజాగా కిరణ్ గోసావి వెల్లడించాడు. `తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాల్సిందిగా ఆర్యన్ ఖాన్ నన్ను కోరాడు. తన తల్లిదండ్రుల మేనేజర్ పూజా దద్లాని నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆర్యన్ చెప్పదలచుకున్న దాన్ని రికార్డు చేసి దానిని పూజకు పంపాను` అని కిరణ్ చెప్పాడు.