సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-07-10T23:13:45+05:30 IST
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ కన్ను మూశారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. సినీ విమర్శకుడిగా

చెన్నై: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ కన్ను మూశారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. సినీ విమర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన సినిమాల్లో ఆర్టిస్ట్గా నటించారు. ‘మిణుగురులు’ చిత్రానికి కో రైటర్గా పని చేసిన ఆయన ‘హృదయ కాలేయం’ చిత్రంలో పోలీస్గా, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘క్రాక్’ వంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించారు. ‘పెసరట్టు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో విమర్శల పాలయ్యారు.
అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై సినీ, రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. తెలుగు బిగ్బాస్ హౌస్లో కొన్ని రోజుల పాటు కంటెస్టెంట్గా ఆయన పాల్గొన్నారు. సమాజంలోని ఓ వర్గంవారి మనోభావాలను దెబ్బతీస్తుండటంతో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ పోలీసుల నుంచి ఆరు నెలల పాటు నగర బహిష్కరణను ఆయన ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి, హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడని పేరు పొందారు కత్తి మహేష్. యాక్సిడెంట్ తర్వాత అతని చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోలుకుంటున్నట్లుగా రీసెంట్గా వార్తలు వచ్చినా.. అకస్మాత్తుగా ఆయన మరణవార్త వినాల్సిరావడం బాధాకరం.