కేటీఆర్‌ సార్‌ ఆదుకోండి: గేయ రచయిత కందికొండ తనయ!

ABN , First Publish Date - 2021-12-05T02:22:54+05:30 IST

సినీ గేయ రచయిత కందికొండ కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. సంగీత ప్రియులను అలరించాయి. కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న సంగతి తెలిసిందే! హైదరాబాద్‌ మోతీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కందికొండ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

కేటీఆర్‌ సార్‌ ఆదుకోండి: గేయ రచయిత కందికొండ తనయ!

సినీ గేయ రచయిత కందికొండ కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. సంగీత ప్రియులను అలరించాయి. కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న సంగతి తెలిసిందే! హైదరాబాద్‌ మోతీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కందికొండ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చికిత్సకు సరిపడ డబ్బు ఆయనదగ్గర లేదు.  కందికొండ తనయ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని,  చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు. 


‘‘కేటీఆర్‌ సర్‌.. ఈ ఏడాది జూన్‌ నెలలో మా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి మాకు సాయం చేసి అండగా నిలిచినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న వెంటిలేటర్‌పై కిమ్స్‌లో ఉన్నప్పుడు మా పరిస్థితి స్వయంగా తెలుసుకుని చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. దాదాపు 40రోజులపాటు వైద్యులు నాన్నకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. గత నెలలోనూ నాన్న వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ‘మెడికవర్‌’లో చేరితే అప్పుడు కూడా మీ కార్యాలయం అత్యంత వేగంగా స్పందించింది. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చూడాలని మా అమ్మ మంత్రి హరీశ్‌రావును గతంలో కోరారు. అందుకు ఆయన  సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారిని కలవాల్సిందిగా సూచించారు. 2012 నుంచి నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు కోసం నాన్న రూ.4.05 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని ఆదేశించాడు. మా కష్టాన్ని గుర్తించి చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా నివాసం కల్పించండి సార్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు కూడా తగిన సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాం. మానాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కలలుకనే ‘బంగారు తెలంగాణ’ కోసం తనవంతు రచనలు చేస్తారని ఆశిస్తున్నా’’ అని మాతృక లేఖ రాశారు.


Updated Date - 2021-12-05T02:22:54+05:30 IST