ఆస్కార్‌ రేసులో ‘జై భీమ్‌’

ABN , First Publish Date - 2022-01-22T05:51:59+05:30 IST

హీరో సూర్య అరుదైన ఘనతను సాధించారు. గత యేడాది ఆయన నటించిన ‘సూరరైపోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా..!’) చిత్రం ఆస్కార్‌ రేసులో నిలిచింది...

ఆస్కార్‌ రేసులో ‘జై భీమ్‌’

హీరో సూర్య అరుదైన ఘనతను సాధించారు. గత యేడాది ఆయన నటించిన ‘సూరరైపోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా..!’) చిత్రం ఆస్కార్‌ రేసులో నిలిచింది. ఈ యేడాది కూడా ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రం 94వ ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ యేడాది మొత్తం ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం 276 చిత్రాలు ఎంపిక చేయగా, వీటిలో మన దేశం నుంచి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో ఒకటి ‘జై భీమ్‌’. మరొకటి మలయాళ చిత్రం ‘మరక్కర్‌’ ఉంది. ‘జై భీమ్‌’ చిత్రం బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో అవకాశం దక్కించుకుంది. 1993లో తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనలు, మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. టీజే ఙ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో సూర్య - జ్యోతికలు తమ సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మించారు. ఇందులో న్యాయవాది చంద్రు పాత్రను సూర్య పోషించారు. ఆస్కార్‌ పురస్కారాల రేసులో నిలవడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. 

ఆంధ్రజ్యోతి (చెన్నై) 


Updated Date - 2022-01-22T05:51:59+05:30 IST