గత 15 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళలేదు.. ఈ సినిమా కోసం వెళ్లా!: జగ్గూభాయ్
ABN , First Publish Date - 2022-01-17T23:19:24+05:30 IST
గత 15 ఏళ్ళుగా నేను థియేటర్కు వెళ్ళలేదు. ఈ సినిమాని థియేటర్లో చూశా. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశా. మొదట్లో ఈ సినిమా చేయవద్దని అనుకున్నా. పెద్ద సినిమాలలో నటించిన నాకు..
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన జగపతిబాబు కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..
‘‘గత 15 ఏళ్ళుగా నేను థియేటర్కు వెళ్ళలేదు. ఈ సినిమాని థియేటర్లో చూశా. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశా. మొదట్లో ఈ సినిమా చేయవద్దని అనుకున్నా. పెద్ద సినిమాలలో నటించిన నాకు కొత్త హీరో, దర్శకుడితో చేయాలనిపించలేదు. కానీ పద్మగారు మా సోదరికి ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి.. ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని ఒప్పించారు. సరేలే చేద్దాం అని చేశాను. జయదేవ్ నాకిష్టమైన వ్యక్తి. ఇక సినిమా చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వచ్చింది. కానీ దర్శకుడు నా అంచనాలను తారుమారు చేసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేశాడు. ఈ సినిమా చూశాక నేను చేసిన హనుమాన్ జంక్షన్ గుర్తుకువచ్చింది. ఇలాంటివి తీయాలంటే దర్శకుడు గొప్ప ప్రతిభను కనబర్చాలి. హీరో అశోక్లో తపన కనిపించింది. ఒకటికి రెండు సార్లు సీన్ బాగా వచ్చే వరకు చేసేవాడు. ఇక నరేశ్ పాత్ర చాలా క్రూరంగా ఉంది. ఒకరకంగా జలసీ కలిగేలా ఆ పాత్ర చేసి మెప్పించాడు’’ అని అన్నారు.