సాహితీ హిమాలయం సీతారాముడు - ఇళయరాజా

ABN , First Publish Date - 2021-12-01T15:32:06+05:30 IST

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.

సాహితీ హిమాలయం సీతారాముడు  - ఇళయరాజా

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు. ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి. రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే " రంగమార్తాండ " కూడా. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!!  సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు..పాటతో అంతర్యుద్ధం చేస్తాడు. పాటలో అంతర్మథనం చెందుతాడు...పాటని ప్రేమిస్తాడు..పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు..పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు. మన భావుకతకి భాషను అద్ది.. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు. అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.."వేటూరి" నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే..."సీతారాముడు" నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు. ధన్యోస్మి మిత్రమా..!! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది. "పాటకోసమే బ్రతికావు, బ్రతికినంత కాలం పాటలే రాసావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా.

Updated Date - 2021-12-01T15:32:06+05:30 IST