మణిరత్నం మెరుస్తుందా..?
ABN , First Publish Date - 2022-09-26T06:35:15+05:30 IST
మణిరత్నం మెరుస్తుందా..?
మణిరత్నం... పరిచయం అవసరం లేని దర్శక దిగ్గజం. ఆయనో క్లాస్. హిట్లూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా, టేకింగ్.. మేకింగ్లతో మెస్మరైజ్ చేసేస్తుంటారు. ప్రతీ కథనీ ఓ దృశ్య కావ్యంగా మలచడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన సినిమాలో పాటలు కొత్తగా ఉంటాయి. పాత్రల స్వభావం అత్యంత సహజంగా ఉంటుంది. వెండి తెరకు ‘మణి’రత్నం.. ఓ కొత్త వెలుగు పంచిందనడంలో సందేహం లేదు. అయితే చాలాకాలంగా ఆయన ఫామ్లో లేరు. ఆయన సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గర ఆడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘పొన్నియన్ సెల్వన్’ వస్తోంది. మణి కలల సినిమా ఇది. నలభై ఏళ్ల నుంచీ ఈ సినిమా తీయడానికి కలలు కంటున్నారు. ఇంతకాలానికి సాధ్యమైంది. కార్తి, విక్రమ్, ‘జయం’ రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్... ఇలా తెర నిండా స్టార్లే. తెర వెనుక తనకిష్టమైన ఏ.ఆర్. రెహమాన్ ఉండనే ఉన్నాడు. వీళ్లంతా కలిసి ఓ అద్భుతాన్ని సృష్టించారన్న నమ్మకం.. మణిరత్నం అభిమానుల్లో ఉంది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. తొలి భాగం ఈనెల 30న వస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. మణిరత్నం సినిమాల్లో భారీ బడ్జెట్ చిత్రమిదే. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఈ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేశాయి. ఈసారి వెండి తెరపై మణి మెరుస్తుందని ఆయన అభిమానుల ఆశ. మరి.. ఈ చలన చిత్ర మాంత్రికుడు.. ఈసారి ఎలాంటి అద్భుతం సృష్టించాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.