దుబాయ్లో ధూం ధాం
ABN , First Publish Date - 2022-02-23T06:48:41+05:30 IST
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులు...

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి తొలివారం నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఇది వరకే ముంబైలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే సంక్రాంతికి రావల్సిన సినిమా వాయిదా పడడంతో, ఆ వ్యయ ప్రయాసలు వృథా అయ్యాయి. ఇప్పుడు మళ్లీ పబ్లిసిటీ కార్యక్రమాలు కొత్తగా మొదలుపెట్టాల్సివస్తోంది. ఈసారి దుబాయ్లో ధూమ్ ధామ్గా ప్రమోషన్ ఈవెంట్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ కార్యక్రమానికి ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ హాజరు అవుతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి దుబాయ్ ఈవెంట్ అనేది ఎప్పుడో ప్లాన్ చేశారు రాజమౌళి. కానీ కరోనా భయాల వల్ల రద్దు చేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో దుబాయ్ ఆలోచన మళ్లీ వచ్చింది. మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతోందని సమాచారం అందుతోంది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.