ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్
ABN , First Publish Date - 2021-10-22T21:30:48+05:30 IST
భారత్లో సినిమా, క్రికెట్ రెండు కళ్ల వంటివి. ఆ రెండింటిని వేరు చూడలేం. ఇప్పటికే కొన్ని ఐపీఎల్ టీమ్ ప్రాంచైజీలకు యజమానులుగా సినిమా తారలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఒక బాలీవుడ్ జంట చేరనుంది.
భారత్లో సినిమా, క్రికెట్ రెండు కళ్ల వంటివి. ఆ రెండింటిని వేరు చేసి చూడలేం. ఇప్పటికే కొన్ని ఐపీఎల్ టీమ్ ప్రాంచైజీలకు యజమానులుగా సినిమా తారలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఒక బాలీవుడ్ జంట చేరనుంది. కొత్త ఐపీఎల్ ప్రాంచైజీ కోసం ఆ జంట బిడ్ను దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ఐపీఎల్ ప్రాంచైజీని దక్కించుకోవడానికి ప్రయత్నించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త ప్రాంచైజీ కోసం బిడ్ను దాఖలు చేయబోతున్నారని మీడియా కోడై కూస్తోంది. బ్రిటన్కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్ కూడా బిడ్ను వేయబోతుందని తెలుస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ కొత్త ప్రాంచైజీ రేసులో ముందంజలో ఉంది. క్రిస్టియానో రొనాల్డో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో మాంచెస్టర్ యునైటెడ్కే ఆడతారు. దుబాయ్లో అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగబోతోంది.
కొత్త ఐపీఎల్ ప్రాంచైజీల కోసం అహ్మదాబాద్, లక్నోల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని మీడియా తెలుపుతోంది. ఈ ప్రాంచైజీల కోసం రాంచీ, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, కటక్, ధర్మశాలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. అదానీ గ్రూప్, నవీన్ జిందాల్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, కొటక్ గ్రూప్, సీవీసీ పార్ట్నర్స్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, సింగపూర్కు చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఇప్పటికే బిడ్డింగ్ పత్రాలను తీసుకున్నాయి. ప్రాంచైజీ కోసం బిడ్ ప్రారంభ ధరగా రూ.2 వేలకోట్లను బీసీసీఐ నిర్ణయించింది
ఐపీఎల్ ప్రాంచైజీలకు అనేక మంది సినిమా తారలు యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్కు ప్రితీ జింటా, కోల్కతా నైట్రైడర్స్కు షారూఖ్ ఖాన్, రాజస్థాన్ రాయల్స్కు శిల్పాశెట్టి ఇప్పటికే యజమానులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. టీ-20 వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం బిడ్డింగ్ ఫలితాలను బీసీసీఐ( బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రకటించనుంది.