అక్టోబర్ 25న తలైవాకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం!
ABN , First Publish Date - 2021-10-23T02:30:28+05:30 IST
భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద పురస్కారంగా భావించేది ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు. భారత సినీ పితామహుడుగా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. కోలీవుడ్లో
భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద పురస్కారంగా భావించేది ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు. భారత సినీ పితామహుడుగా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. కోలీవుడ్లో నడిగర్ తిలగం శివాజీ గణేశన్, దర్శక దిగ్గజం కె.బాలచందర్ వంటి వారిని ఈ పురస్కారం వరించింది. ఈ క్రమంలో గత 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం సూపర్స్టార్ రజనీకాంత్కు ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఈనెల 25వ తేదీన ఢిల్లీలో జరుగనుంది.
దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన అతి త్వరలో రానుంది. ఈ కార్యక్రమంలో ఈ అవార్డును రజనీకాంత్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రదానం చేయనున్నారు. అలాగే, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం కూడా ఆరోజే జరుగనుంది. ఇందులో ఉత్తమ సహాయ నటుడి అవార్డును విజయ్ సేతుపతి, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును డి.ఇమ్మాన్, ఉత్తమ బాల నటుడి అవార్డును నాగవిశాల్, బెస్ట్ జ్యూరీ ఫిల్మ్ అవార్డును పార్తిబన్ (ఒత్త చెరుప్పు సైజు 7) స్వీకరించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరుగనుంది.