మా నాన్నగారికి కోపం వచ్చిందంటే...! : చిరంజీవి
ABN , First Publish Date - 2021-04-27T23:55:31+05:30 IST
తమ అన్నదమ్ములందరిలో తండ్రి కోపానికి ఎక్కువగా బలయింది తనేనని మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నాన్నకు కోపం వచ్చిందని తెలియగానే
తమ అన్నదమ్ములందరిలో తండ్రి కోపానికి ఎక్కువగా బలయింది తనేనని మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నాన్నకు కోపం వచ్చిందని తెలియగానే నాగబాబు పారిపోయేవాడు. కల్యాణ్ పసివాడు కాబట్టి తప్పించుకొనేవాడు. ఆడపిల్లల్ని ఏమీ అనేవారు కాదు. దాంతో నేనే దొరికిపోయేవాడిని. ఆయన చేతిలో తబలా, మద్దెల, మృదంగం అన్నీ నేనే అయ్యేవాడిని. పరీక్షల సమయంలో పొద్దున్నే లేచి చదువుకోకుండా గోగు పుల్లలతో నేను, నాగబాబు కత్తి యుద్ధం చేస్తుంటే... అవి ఎక్కడ కంట్లో పొడుచుకుంటాయోనని టెన్షన్తో వచ్చి అవే గోగు పుల్లలతో నన్ను వాయించేవారు. నాగబాబు పారిపోయి తప్పించుకునేవాడు. ఇంటర్లో ఉండగా జరిగిన ఓ సంఘటన చెప్పాలి.
ఓ సమ్మర్లో ఫ్యాన్ రిపేర్కి వస్తే బాగు చేయించుకురమ్మని నాకు చెప్పారు నాన్న. ఆ ఫ్యాన్ తీసుకెళ్లి ఓ మెకానిక్కి ఇచ్చాను. అయితే అతను ఫ్యాన్ రిపేర్ చేయకుండా సాయంత్రం షాప్ కట్టేసి చెప్పా పెట్టకుండా ఊరు వెళ్లిపోయాడు. అందులో నా తప్పులేదు. ఫ్యాన్ లేనిదే నాన్నకు నిద్రపట్టదు. దగ్గరుండి రిపేర్ చేయించలేదని కోపం వచ్చి నన్ను బాగా కొట్టి ఫ్యాన్ తీసుకువచ్చేవరకూ ఇంటికి రావద్దు అని చెప్పి నన్ను బయటకు పంపేశారు. నేను ఏడ్చుకుంటూ నా స్నేహితుడి ఇంటికి వెళ్లి అడిగితే వాళ్ల టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. అది నేను తీసుకుని ఇంటికి వచ్చేలోగా నాన్నకు కోపం చల్లారక ‘వీడికి చదువు దండగ’ అని నా బోటనీ రికార్డ్స్ అన్నీ చింపేశారు. ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఏడుస్తూ కూర్చున్నాను.
మరుసటి రోజు ఆయనకే గిల్టీగా అనిపించిందేమో, నన్ను దగ్గరకి తీసుకుని సముదాయించారు. బజారుకు తీసుకెళ్లి టెర్లిన్, టెరికాట్ ప్యాంట్లు షర్ట్లు కొనిపెట్టారు. బోటనీ రికార్డు బుక్ కొని అందులో తనే స్వయంగా బొమ్మలు వేశారు. మా అందరిలో కల్యాణ్ని మాత్రం ఏమీ అనేవారు కాదు. అందుకు కారణం ఉంది. వాడు అచ్చం మా తాతలా ఉంటాడు. వాడిని చూసినప్పుడల్లా ‘నువ్వు మా నాన్నవి రా’ అని అనేవారు. నాగబాబునేమో వాళ్ల తాతయ్య అనేవారు. నన్ను మాత్రం వాళ్ల మామగారు అనేవారు. పిల్లనిచ్చిన మామగారంటే ఎవరికైనా లోకువే కదా...!’’ అని నవ్వేశారు చిరంజీవి.