హీరో సిద్ధార్ధ్‌కు చెన్నై పోలీసుల సమన్లు

ABN , First Publish Date - 2022-01-21T10:05:34+05:30 IST

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను కించపరిచేలా ట్వీట్‌ చేసిన కేసులో హీరో సిద్ధార్థ్‌కు సమన్లు జారీచేసినట్టు చెన్నై నగర పోలీస్‌...

హీరో సిద్ధార్ధ్‌కు చెన్నై పోలీసుల సమన్లు

సైనా నెహ్వాల్‌పై ట్వీట్‌ కేసులో జారీ

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను కించపరిచేలా ట్వీట్‌ చేసిన కేసులో హీరో సిద్ధార్థ్‌కు సమన్లు జారీచేసినట్టు చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ వెల్లడించారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సిద్ధార్థ్‌ను ఏ విధంగా విచారించాలనే విషయంపై తర్జనభర్జన జరుగుతున్నట్టు చెప్పారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పంజాబ్‌ పర్యటనను రైతులు అడ్డుకున్నారు. దీనిని సైనా నెహ్వాల్‌ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రధానికే రక్షణ లేనప్పుడు దేశం భద్రంగా ఎలా ఉంటుందంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై సిద్ధార్థ్‌ స్పందించారు. ‘చిన్న కాక్‌తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్‌.. దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వాఖ్యలను జాతీయ మహిళా సంఘం తీవ్రంగా పరిగణించి, సిద్ధార్థ్‌ ట్వీట్‌ను ఖండించింది. ఈ వ్యాఖ్యలు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. దీంతో చెన్నై పోలీస్‌ కమిషనర్‌.. సిద్ధార్థ్‌కు సమన్లు జారీచేసినట్టు వెల్లడించారు. కాగా, తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ, సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్‌ బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.

(ఆంధ్రజ్యోతి, చెన్నై)


Updated Date - 2022-01-21T10:05:34+05:30 IST