ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేరు!
ABN , First Publish Date - 2022-10-04T07:29:48+05:30 IST
నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. దసరా కానుకగా బుధవారం విడుదల అవుతోంది...
నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. దసరా కానుకగా బుధవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ది ఘోస్ట్ చాలా స్టైలీష్గా ఉంటుంది. నాగార్జునని ఇది వరకెప్పుడూ చూడని పాత్రలో తీర్చిదిద్దారు. ఫైట్స్ ఎక్కువే అయినా.. ఇది కూడా ఓ ఫ్యామిలీ సినిమానే. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ఎమోషన్స్ చాలా ఉన్నాయి. కొవిడ్ వల్ల సినిమా ఆలస్యమైంది. బడ్జెట్ కూడా పెరిగింది. కథపై నమ్మకంతో ఈ సినిమాపై ఎంతైనా ఖర్చు పెట్టొచ్చని అనుకొన్నాం. ఆ క్వాలిటీ అంతా తెరపై కనిపిస్తుంది. నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు సునీల్ నారంగ్. ‘‘ఘోస్ట్ స్ర్కీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా తెరపై నుంచి చూపు తిప్పుకోలేరు. పండగ రోజున రెండు మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడం సహజమే. ఎవరికి రావాల్సిన థియేటర్లు వాళ్లకు వచ్చాయి. టికెట్ రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచేలా నిర్ణయించాం. థియేటర్లకు వచ్చేది ఎక్కువగా మధ్యతరగతి ప్రజలే. వాళ్లకు సినిమా అందుబాటులో ఉండాలన్నదే మా లక్ష్యం’’ అని రామ్మోహన్ రావు తెలిపారు.