Amitabh Bachchan: అప్పట్లో ఏడుగురితో కలసి ఉండేవాడిని

ABN , First Publish Date - 2022-12-01T00:35:43+05:30 IST

ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్ బీకి అభిమానులున్నారు.

Amitabh Bachchan: అప్పట్లో ఏడుగురితో కలసి ఉండేవాడిని

ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). కశ్మీర్ నుంచి  కన్యాకుమారి వరకు బిగ్ బీకి అభిమానులున్నారు. ప్రేక్షకుల్లోను విపరీతమైన క్రేజ్ ఉంది. తాను కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అమితాబ్ తాజాగా ప్రేక్షకులతో పంచుకున్నారు. కోల్‌కత్తాలో గతంలో గడిపిన రోజులను స్మరించుకున్నారు. తాను 1968లో నెలకు రూ.1640లను అర్జించేవాడినని తెలిపారు. ఓ చిన్న గదిలో ఏడుగురితో కలసి నివసించేవాడినని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటని అమితాబ్ తన బ్లాగ్‌లో చెప్పుకొచ్చారు.


చివరి జీతానికి సంబంధించిన రసీదును కూడా అమితాబ్ పంచుకున్నారు. ‘‘నేను బ్లాకర్స్ కంపెనీలో 30 నవంబర్‌ 1968న చివరగా పనిచేశాను. అప్పుడు నా జీతం రూ.1640. ఆ ఫైల్ ఇప్పటికి నా దగ్గరే భద్రంగా ఉంది. 10చదరపు అడుగుల గదిలో ఏడుగురితో కలసి ఉండేవాడిని. మా వద్ద డబ్బు లేకపోయినా పెద్ద పెద్ద బేకరీలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల దగ్గర నిల్చొనే వాళ్లం. ఏదో ఒకరోజు అందులోకి వెళ్తామనే ఆశతో ఉండేవాళ్లం’’ అని అమితాబ్ తెలిపారు. గతంలోకి వెళ్లి అప్పటికీ ఇప్పటికీ జీవితం ఎంత మారిందో చెప్పారు. ‘‘షూటింగ్ కోసం మళ్లీ ఇదే కోల్‌కత్తాకు తిరిగి రావడం. అర్ధరాత్రి సమయాల్లో గతంలో నేను ఉన్న వీధుల్లో తిరగడం.. ప్రతి ప్రదేశానికి వెళ్లడం.. అక్కడ జరిగిన వాటిని గుర్తు చేసుకోవడం చాలా బాగుంది. అప్పటి మిత్రుల్లో కొంత మందిని కోల్పోయాను. మరికొంత మందితో ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాను’’ అని బిగ్ బీ చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. బిగ్ బీ చివరగా ‘గుడ్ బై’ (Good Bye) లో నటించారు. ఈ చిత్రంతోనే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో నటిస్తున్నారు. మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీలో అమితాబ్ పాత్రను రూపొందించారు. ‘ప్రాజెక్ట్ కె’ లో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   

Updated Date - 2022-12-01T00:35:43+05:30 IST