మారుతి కారులో వచ్చిన హృతిక్ రోషన్, మెర్సిడెజ్ బెంజ్‌లో హీరోయిన్ రావడంతో సెటైర్లు...

ABN , First Publish Date - 2022-01-28T23:52:52+05:30 IST

బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించినప్పుడు మీడియా తనను తీవ్రంగా దూషించిందంటూ నిన్నటి తరం హాట్ బ్యూటీ అమీషా పటేల్

మారుతి కారులో వచ్చిన హృతిక్ రోషన్, మెర్సిడెజ్ బెంజ్‌లో హీరోయిన్ రావడంతో సెటైర్లు...

బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించినప్పుడు మీడియా తనను తీవ్రంగా దూషించిందంటూ నిన్నటి తరం హాట్ బ్యూటీ అమీషా పటేల్ చెప్పింది. తాను గాసిప్ మెటీరియల్ కాకపోవడమే అందుకు కారణమని ఆమె పేర్కొంది. 


అమీషా పటేల్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించాడు. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. తర్వాత అమీషా అనేక చిత్రాల్లో నటించినప్పటికి అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఇక తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ‘‘నా కెరీర్ ప్రారంభించినప్పుడు నన్ను అహంకారిగా మీడియా చిత్రీకరించింది. ఎందుకంటే, పనికిమాలిన గాసిప్స్‌లో నేను పాలు పంచుకునేదాన్ని కాదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటానికి ఇష్టపడకపోయేదాన్ని. నటీ, నటులు ఎవరైనా హిట్ కొడితే నేను కూడా సంతోషించేదాన్ని. వారు అద్భుతంగా నటించారని చెప్పేదాన్ని’’ అని అమీషా పటేల్ తెలిపింది. 


‘‘నేను విపరీతంగా పుస్తకాలు చదువుతాను. మూడు రోజుల్లోనే ఒక పుస్తకాన్ని పూర్తి చేస్తాను. హృతిక్‌తో సినిమా చేస్తున్నప్పుడు కూడా పుస్తకాలు చదివే అలవాటు మానలేదు. పెద్ద కుటుంబం నుంచి రావడంతో నా గురించి విపరీతంగా గాసిప్స్‌ను ప్రచారం చేసేవారు. ‘కహోనా ప్యార్ హై’ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన మొదటి రోజు మెర్సిడెజ్ బెంజ్ కారులో నేను వచ్చాను. హృతిక్ మాత్రం మారుతి కారులో వచ్చాడు. దీంతో అందరూ నాపై సెటైర్లు కురిపించారు. నా ఆస్తి, పాస్తులను చూపెడుతున్నానని అనుకునేవారు. కానీ, అలా చేయాలనే ఉద్దేశం నాకు లేదు.  నేను చిన్నప్పట్నుంచీ అదే విధంగా పెరిగాను. నేను సినిమా‌ చేస్తున్నప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడేదాన్ని కాదు’’ అని ఆమె వివరించింది. అమీషా పటేల్ ప్రస్తుతం ‘గదర్’ సీక్వెల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


Updated Date - 2022-01-28T23:52:52+05:30 IST