‘షమితాబ్’ బాలీవుడ్ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది కమల్ హాసన్ తనయ అక్షరా హాసన్. ఆ మూవీ అంతగా మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ.. ఆమెకు మంచి పేరే వచ్చింది. బాలీవుడ్ లోనే ‘లాల్ కీ షాదీ మే.. లాడూ దీవానా’ అనే మూవీలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత అజిత్ ‘వివేకం’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమ్ ‘కడారం కొండాన్’ లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘అచ్చం మడం నాణం పయిర్పు’ షూటింగ్ పూర్తి కాగా, అగ్ని సిరగుగల్’ సినిమా సెట్స్ పై ఉంది. అయితే వీటిలో ‘అచ్చం మడం నాణం పయిర్పు’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.
దర్శకుడు ఎస్.రామమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉషా ఉతప్ ఇందులో అక్షర హాసన్కు అవ్వ గా నటించారు. కెమెరా శ్రేయ దేవ్. సంగీతం సుషా. ఈ సినిమాను థియేటర్లో కాకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. దీంతో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, అక్షర హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈమె అక్క శృతి హాసన్ ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.