అజిత్ ‘వాలి’ రీమేక్ హక్కుల వివాదంలో.. బోనీ కపూర్‌కి అనుకూలంగా కోర్టు తీర్పు

ABN , First Publish Date - 2021-11-27T23:53:54+05:30 IST

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వాలి’ రీమేక్ హక్కుల వివాదంలో.. నిర్మాత బోనీ కపూర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అజిత్ కవలలుగా.. తమిళ్ హీరో కం దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘వాలి’. తెలుగు, తమిళ భాషలలో..

అజిత్ ‘వాలి’ రీమేక్ హక్కుల వివాదంలో.. బోనీ కపూర్‌కి అనుకూలంగా కోర్టు తీర్పు

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వాలి’ రీమేక్ హక్కుల వివాదంలో.. నిర్మాత బోనీ కపూర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అజిత్ కవలలుగా.. తమిళ్ హీరో కం దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘వాలి’. తెలుగు, తమిళ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్‌లలో రీమేక్ కాలేదు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో డబ్బింగ్ చిత్రంగా విడుదలైంది. అజిత్‌ని అగ్ర హీరోగా మార్చిన ఈ ‘వాలి’ చిత్ర తమిళ మరియు కన్నడ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్‌ని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దక్కించుకున్నారు. 


వాస్తవానికి ఆయన 2020లోనే ఈ హక్కులను దక్కించుకున్నా.. చిత్ర దర్శకుడు ఎస్‌జె సూర్య కోర్టులో కేసు వేయడం మరియు కరోనా కారణంగా ఓ ఏడాది పాటు ఈ చిత్ర రీమేక్‌ హక్కులపై ఎటువంటి వార్త బయటికి రాలేదు. కాగా, ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు తీర్పు బోనీ కపూర్‌కు అనుకూలంగా రావడంతో ఈ సినిమా రీమేక్ కై బోనీ కపూర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ బ్లాక్‌ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్ మరియు నరసింహ ఎంటర్ ప్రైజస్ నిర్మించనున్నాయి. చీఫ్ జస్టిస్ సాజిబ్ బెనర్జీ మరియు జస్టిస్ పిడి. ఆదికేశవులు ఇచ్చిన తీర్పులో కాపీరైట్ పైన నిర్మాతకు కూడా సంపూర్ణ హక్కులు ఉంటాయని తెల్చేయడంతో ఇప్పుడు అన్ని అడ్డంకులను తొలగించుకొని రీమేక్‌కి బోనీ కపూర్ సిద్ధమవుతున్నారు. 2022లో చిత్ర రీమేక్ వివరాలు వెల్లడికానున్నాయి.

Updated Date - 2021-11-27T23:53:54+05:30 IST