కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బహుభాషా నటుడు సోనూసూద్ మంగళవారం తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలుసుకున్నారు. ఈ సమావేశంలో సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఆయన పనిచేస్తున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ''రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలలో హైదరాబాద్లోనే కోటి మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. మరో నాలుగు ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. హాస్పిటల్స్ కట్టడం పెద్ద పని కాదు, వాటిని మెయింటైన్ చేయడమే పెద్ద సమస్య.." అని సోనూసూద్కి కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని కేటీఆర్కు సోనూసూద్ తెలియజేశారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనూసూద్ అన్నారు. ఈ సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి.. ఒక జ్ఞాపికను మంత్రి కేటీఆర్ అందజేశారు. కేటీఆర్తో జరిగిన ఈ సమావేశంలో సోనూసూద్తో పాటు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.