క్యారెక్టర్ నటుడు రాజబాబు ఇకలేరు

ABN , First Publish Date - 2021-10-25T13:15:26+05:30 IST

తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు . రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు.

క్యారెక్టర్ నటుడు రాజబాబు ఇకలేరు

తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు . రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి .తన చుట్టూ వున్న వారిని  హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది . రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు . ఆయన తండ్రి పేరు రామతారకం . ఆయన చిత్ర నిర్మాత నటుడు . దాసరి నారాయణ రావు దర్శకత్వంలో "స్వర్గం -నరకం ", "రాధమ్మ పెళ్లి " సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా , కబడే ఆడటమన్నా , రంగస్థల మీద నటించడమన్నా ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ  దేశమంతా తిరిగారు. 


దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును. 1995లో  “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు . ఆ తరువాత  సిందూరం సినిమా తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి . కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి  సినిమా రంగంపై దృష్టి పెట్టారు .ఆనతి కాలంలోనే రాజబాబు ,  సముద్రం ఆడవారి మాటలకు  అర్ధాలే వేరులే , మురారి ,శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,సముద్రం , కళ్యాణ వైభోగం ,మళ్ళీ రావా ?, శ్రీకారం , బ్రమ్మోత్సవం , భరత్ అనే మొదలైన  62 చిత్రాల్లో  విభిన్నమైన పాత్రలను పోషించారు . సినిమాతో పాటు  టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు. . వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం , చి ల సౌ స్రవంతి ,ప్రియాంక సీరియల్స్  లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.  రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు . 

2005వ సంవత్సరంలో  "అమ్మ " సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు. రాజబాబు కు పుట్టి పెరిగిన వూరు అంటే ఎంతో ఇష్టం , సంక్రాంతికి కాకినాడ వెళ్లి మిత్రులతో సరదాగా గడుపుతూ , కోడి పందాలలో పాల్గొనేవాడు. సినిమా రంగంలోనూ , టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు. తెలుగు తనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా వుంటారు.

Updated Date - 2021-10-25T13:15:26+05:30 IST