‘ఆరడుగుల బుల్లెట్’ అందరికి నచ్చే చేశాం: డైరెక్టర్ బి. గోపాల్

ABN , First Publish Date - 2021-10-07T01:09:38+05:30 IST

మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు..

‘ఆరడుగుల బుల్లెట్’ అందరికి నచ్చే చేశాం: డైరెక్టర్ బి. గోపాల్

మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. అక్టోబర్ 8న భారీగా థియేటర్లలోకి వచ్చేందుకు అంతా సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు బి. గోపాల్ మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. మణిశర్మ‌గారు మరోసారి ఈ సినిమాకు చాలా మంచి సంగీతం ఇచ్చారు. సమరసింహారెడ్డి, ఇంద్ర ఇలా ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్. ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు ప్రేక్షకులకు నచ్చుతాయి.


నరసింహనాయుడు సినిమా విడుదలైన తరువాత పది నెలలు ఖాళీగా ఉన్నాను. 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయవచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను. అశ్వనీదత్ గారు, చంటి అడ్డాలగారు ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. అలా ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలు మొదలయ్యాయి. అలా స్క్రిప్ట్‌లు రెడీ అయితే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేశాను.


అందరికీ ఈ సబ్జెక్ట్ నచ్చే చిత్రాన్ని చేశాం. వక్కంతం వంశీ కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే మొదలుపెట్టాం. నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు, కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్నికృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను. స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.


ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు. ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. నేను సాఫ్ట్‌గా ఉంటాను. మైకుల ముందు కూడా మాట్లాడటం రాదు. కానీ సినిమాల్లో మాత్రం హింస ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నా స్క్రిప్ట్ రైటర్స్. స్క్రిప్ట్‌ను బట్టి, నా హీరోలను బట్టి ఓ డైనమిక్ షాట్‌ను పెట్టాలనిపిస్తుంది. అందుకే అలాంటి సీన్స్ పడ్డాయి. నాకు రీమేక్‌లు చేయడం ఎక్కువగా నచ్చదు. అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ చేశాను. కొత్త స్క్రిప్ట్‌తోనే సినిమాలు చేయడం ఇష్టం..’’ అని తెలిపారు.

Updated Date - 2021-10-07T01:09:38+05:30 IST