పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న క్రేజీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ (Aadipurush). భారతీయ ఇతిహాస కావ్యమైన రామాయణాన్ని శ్రీరాముని కోణంలో విభిన్న రీతిలో వెండితెరపై భారీ ఎత్తున ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ (Om raut). తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ, ప్రపంచ వ్యా్ప్తంగానూ వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్లో విడుదల కాబోతోంది. 3డి వెర్షన్ లో, ప్రేక్షకులకు అద్బుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్నూ కలిగించబోతున్నారు. ఎప్పుడో టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సిజీ వర్క్ జరుపుకుంటోంది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్దత్త నాగే, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 35 కోట్లను డిమాండ్ చేస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటివరకూ బైటికి రాలేదు. కనీసం హీరో, హీరోయిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రాలేదు. అయినప్పటికీ ఈ సినిమాకి ఆ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ పలకడం విశేషమని చెప్పాలి. అయితే ప్రభాస్ హీరో కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్స్ బేరసారాలు సాగించకుండానే ఆ రేట్కు రైట్స్ కొనడానికి అంగీకారం తెలిపారట. ఓవర్సీస్ లోని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్ను కైవసం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.
ప్రముఖ జపనీస్ ఫిల్మ్ మేకర్ యూగో సాకో (Yugo Sako) యానిమేషన్ వెర్షన్ ‘ది ప్రిన్స్ ఆఫ్ లైట్’ (The Prince Of Light) ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఓంరౌత్ తెరకెక్కిస్తున్నట్టు వినికిడి. 2000 లో ఒకసారి ఆయన సినిమాల స్ర్కీనింగ్కు వెళ్ళినప్పుడు ఓంరౌత్ ఆ సినిమాను చూశాడట. ఆ సినిమా ప్రేరణతో దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ఓంరౌత్ ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించడం గమనార్హం. మరి ‘ఆదిపురుష్’ చిత్రం ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.