VijayaShanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. విజయశాంతి వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:49 PM
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ్రామ్, విజయశాంతి సినిమాకు సంబంధి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి (VijayaShanti) కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ్రామ్, విజయశాంతి సినిమాకు సంబంధి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ వినగానే ఏదో తెలియని అనుభూతి. ఎలాగైనా చేయాలనిపించింది. కల్యాణ్రామ్.. అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు. సినిమా పూర్తయిపోయింది. ఇకపై మీ అందరినీ మిస్ అవుతుంటా. వీలున్నప్పుడల్లా కలుద్దాం. ఈ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత ఇక మీ చేతుల్లోనే ఉంది. ఇందులో నేను యాక్షన్ సీన్స్ కూడా చేశా. నా అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ అని చెప్పగానే కాస్త సవాలుగా అనిపించింది. షూట్ రోజు సెట్లో ఉన్న వాళ్లందరూ ఎంతో కంగారుపడ్డారు. కానీ, తొలి షాట్లోనే సీన్ పూర్తిచేశా. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదే లే. ఎంత వయసు వచ్చినా అంతే స్ర్టాంగ్, క్రమశిక్షణతో ఉంటాను. నా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచడం వల్లే మీ అందరి ఆశీస్సులు పొంది ఈ స్థాయికి వచ్చా’’ అని విజయశాంతి అన్నారు.
‘‘విజయశాంతిగారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమెను నేను అమ్మ అనే పిలుస్తాను. చిన్నప్పుడు ‘సూర్య ఐపీఎస్’ షూట్కు వెళాను. ఆ సమయంలో ఆమె నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే కర్తవ్యం’లో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. ప్రదీప్ ఈ కథతో నావద్దకు వచ్చినప్పుడు ‘అమ్మ అంగీకరిస్తారా?’ అని అడిగా. అమ్మ అంగీకరించకుండా చేయడం కరెక్ట్ కాదేమోననిపించింది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ అమ్మ. ఈ వయసులోనూ ఆమె ఎలాంటి డూప్స్ లేకుండా స్టంట్స్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో పృథ్వీ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ‘యానిమల్’తో తనకు బాలీవుడ్లో ఎంత గుర్తింపు వచ్చిందో తెలుగులో ఈ సినిమాతో వస్తుందని నమ్మి చేశారు. డబ్బింగ్ కూడా చెప్పారు. నేను నటించిన ‘అతనొక్కడే’ విడుదలై 20 ఏళ్లు అయినా ప్రేక్షకులకు గుర్తుంది. అదే విధంగా ఈ సినిమా కూడా ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది’’ అని కల్యాణ్ రామ్ అన్నారు.