Sookshmadarshini: సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:30 PM

ఇటీవల మీర్‌పేట్‌ మాధవి హత్య అలా జరిగిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షణికావేశంలో జరిగిన హత్యను కప్పి పుచ్చేందుకు నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్‌ అయిన సినిమాతో ప్రేరణ పొందినట్టు ఇన్వెస్టిగేషన్‌లో తేలించి.

సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. కొన్ని సినిమాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మంచి చేయడానికి ప్రేరణగా నిలుస్తాయి. ఒక్కోసారి అవే మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. సినిమాల స్ఫూర్తి ఒక్కోసారి మంచి తో పాటు చెడునూ చేస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమాలు, సిరీస్‌ల ప్రభావంతో చాలా క్రైమ్‌లు (Crime) జరుగుతున్నాయి. ఇటీవల మీర్‌పేట్‌ మాధవి హత్య అలా జరిగిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షణికావేశంలో జరిగిన హత్యను కప్పి పుచ్చేందుకు నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్‌ అయిన సినిమాతో ప్రేరణ పొందినట్టు ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం సూక్ష్మదర్శిని (sookshmadarshini) వెబ్‌ సిరీస్‌ స్ఫూర్తితోనే తన భార్య మాధవిని (Meerpet Madhavi) హత్య చేసినట్టు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడు శవాన్ని మాయం చేసిన నేపథ్యం అంతా 'సూక్ష్మదర్శిని’ సినిమాతో ప్రేరణ పొందినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేేసందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్‌ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్‌రూమ్‌ ఫ్లష్‌ ద్వారా వదులుతారు. ఈ సినిమాలో చేసినట్లు గురుమూర్తి కూడా శవాన్ని మాయం చేశాడు.


గతంలో 'ఎవడు' సినిమా స్ఫూర్తితో భర్త స్థానంలో ప్రియుడిని తీసుకురావటానికి ఓ వివాహిత ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు మీర్‌పేట్‌ కేసు కూడా అలాగే జరిగింది. మొదట భార్య శవాన్ని కుక్కర్‌లో ఉడికించి మాయం చేసినట్టు పోలీసులకు చెప్పిన గురుమూర్తి (Guru murthy) శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించినట్టు గుట్టు విప్పాడు. భార్యను హత్య చేసిన తర్వాత విషయం బయటపడితే ఆమె కుటుంబ సభ్యుల నుంచి హాని కలుగుతుందని భావించి ఆమె శవాన్ని మాయం చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన సూక్ష్మదర్శిని అనే మలయాళ డబ్బింగ్‌ సినిమాలో శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లు, రసాయనాలను వినియోగించడం గుర్తుకురావడంతో ఆ టెక్నిక్స్‌ ఉపయోగించినట్టు పోలీసులకు వివరించాడు. సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వారి మాట వినకుండా పెళ్లి చేసుకుని బాలికను దత్తత తీసుకున్న కూతురిని.. ఆమె తల్లి కొడుకుతో కలిసి హత్య చేస్తుంది. శవాన్ని మాయం చేయడానికి ఇంట్లో చిన్న నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసి, అందులో యాసిడ్‌, రసాయనాలు కలిపి శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్‌, రసాయనాలతో శవాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తారు.  ఆ నీటిని వాష్‌ రూమ్‌ ద్వారా ఫ్లష్‌ చేసేస్తారు. కరగని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి ఫ్లష్‌ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారు.


మీర్‌పేట్‌ మాధవి (Meerpet Madhavi) కేసులో కూడా నిందితుడు శవాన్ని అలాగే మాయం చేసి నేరం నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. రంపం బ్లేడుతో తల, మొండెం వేరు చేసి, శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి, మాంసాన్ని బకెట్‌లో వేసి హీటర్‌తో ఉడికించాడు. ఆ తర్వాత ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్‌, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంతగా పేస్ట్‌ తరహాలో మార్చేశాడు. ఎముకలను ఇంట్లోనే స్టవ్‌పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి దంచి పొడిలా మార్చేశాడు. ఇదంతా నిందితుడు ఒక్కడే ఇంట్లోనే చేశాడు. వీటిని కొంత బాత్‌రూమ్‌లో ఫ్లష్‌ ద్వారా, మరికొంత బకెట్‌లో వేసుకొని మీర్‌పేట పెద్ద చెరువులో పారేశాడు.  ఆధారాలు దొరక్కుండా ఇంటిని రసాయనాలతో క్లీన్‌ చేశాడు. శవాన్ని మాయం చేేస క్రమంలో ఎముకల్ని కాలుస్తున్న సమయంలో నిందితుడు గురుమూర్తి చేతులు పలు చోట్ల కాలాయి. శవాన్ని మాయం చేేస ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను పోలీసులకు వివరించాడు. ఇంట్లోంచి దుర్వాసన బయటకు రాకుండా కెమికల్స్ వినియోగించాడు. నిందితుడు యాసిడ్లను కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. గదిలో రక్తపు ఆనవాళ్లు లేకుండా మాయం చేసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేలపై రక్తపు మరకల్ని గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో రక్తపు మరకలు శాశ్వతంగా మాయం చేసే అవకాశం లేకపోవడంతో ఘటనా స్థలంలో ఆధారాలను గుర్తించారు. డీఎన్‌ఏ నమూనాలు హతురాలు వెంకట మాధవికి చెందినవేనని నిర్థారించారు.

Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 04:35 PM