Vishwambhara: ఎట్టకేలకు అల్లుడి కోరిక తీర్చిన చిరు.. అభిమానులకు పండగే
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:57 PM
టాలీవుడ్లో హీరోల్లో ప్రతి ఒక్కరూ చిరంజీవితో (Chiranjeevi) స్క్రీన్ షేర్ చేసుకోవాలని, డైరెక్టర్లు అయితే ఆయనతో ఒక సినిమా అయినా డైరెక్ట్ చేయాలనుకుంటారు. అలా ఎదురుచూసే వాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు.
టాలీవుడ్లో హీరోల్లో ప్రతి ఒక్కరూ చిరంజీవితో (Chiranjeevi) స్క్రీన్ షేర్ చేసుకోవాలని, డైరెక్టర్లు అయితే ఆయనతో ఒక సినిమా అయినా డైరెక్ట్ చేయాలనుకుంటారు. అలా ఎదురుచూసే వాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. ఆ క్యూలైన్లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. బ్రో సినిమాతో పవన్లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన మెగాస్టార్ చిరంజీవితోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ఇప్పటికీ అతని కల నెరవేరబోతోంది. ఎట్టకేలకు చిరంజీవి సినిమాలో నటించే అవకాశం సాయి దుర్గ తేజ్ అందుకున్నారు. మామా అల్లుళ్ళు ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సాయి దుర్గా తేజ్ (Sai Durga tej) ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారు.
చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). వశిష్ఠ మల్లిడి (Vassista Mallidi0 దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ అతిథి పాత్రలో తేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మామా అల్లుళ్ల మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే వారం కూడా మూడు నాలుగు రోజులు చిత్రీకరణ చేయనున్నారని తెలిసింది. చిరంజీవి మీద శోభిత మాస్టర్ కొరియోగ్రఫీలో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు. బహుశా... ఆ పాటలో మామా అల్లుళ్ళు సందడి చేసే అవకాశం ఉంది. ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సాయితేజ్ విషయానికి వస్తే ప్రస్తుతం రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సంబరాల యేటి గట్టు’ సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది