Akkineni Nagarjuna: ప్రధానితో నాగార్జున భేటీ.. పార్లమెంట్లో ఆసక్తికర ఘటన
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:56 PM
శుక్రవారం నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంతో సహా కలిసి భారత పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే..
ప్రధాని నరేంద్ర మోదీతో టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ భేటీ అయింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. కాగా, హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా జరిగిన మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రాఫీ లాంఛ్ గురించి అని సమాచారం.
అయితే ప్రధానిని కలిసే ముందు నాగార్జున పార్లమెంటులోని టీడీపీ ఆఫీసు కు వెళ్లారు. అక్కడ పలువురు ఎంపీలతో ఆయన మాట్లాడాడు. ఈ క్రమంలోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నాగార్జునతో కలిసి ఫోటో దిగారు. దీనిని ఆమె సోషల్ మీడియాలో ‘‘ నేను ఈరోజు పార్లమెంట్లోని టీడీపీ కార్యాలయంలో నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులను కలిశాను’’ అని రాస్తూ పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భిన్న రాజకీయ అభిప్రాయాలూ కలిగిన నాగార్జున టీడీపీ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే.. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్' నేడు విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో నాగ చైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్గానే చూసిన అక్కినేని అభిమానులకు తనలోని మరో యాంగిల్ను చూపించారు నాగ చైతన్య . పాకిస్థాన్లో దొరికిపోయిన జాలరిగా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య నటించి అందరిని మెప్పించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.