L2 empuraan: ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:40 AM

దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి మోహన్‌లాల్‌ నేషనల్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోహన్‌లాల్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు.


మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohan lal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం  ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌ (L2 empuraan -రాజు కన్నా గొప్పవాడు)’. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.  ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి మోహన్‌లాల్‌ నేషనల్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోహన్‌లాల్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘నేను సినిమాల్లోకి వచ్చి 47 ఏళ్లు అవుతోంది.  సుదీర్ఘమైన ప్రయాణం నాది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. నా విజయం వెనుక ఎంతో మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వాళ్ల కారణంగానే ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకోగలిగాను. నా కోసం విభిన్నమైన క్రియేట్‌ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. బాక్సాఫీస్‌ నంబర్ల కంటే ప్రేక్షకుల ప్రేమాభిమానమే ముఖ్యం అని నమ్ముతూ ముందుకెళ్తున్నా. రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు నావి ఎన్నో ఉన్నాయి. కలెక్షన్లు ఎంత ముఖ్యమో.. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడం కూడా అంతే ముఖ్యం. మలయాళ భాష మీద అభిమానంతోనే ఇతర భాషల్లో   ఎక్కువ సినిమాలు చేయాలి అని అనుకోలేదు. హిందీ సినిమాల్లో నటించకపోవడానికి కూడా ఇదే కారణం’’ అని మోహన్‌లాల్‌ వివరించారు.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌ కారణంగానే ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ తెరకెక్కింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక దర్శకుడిగా నేను నిర్మాతల గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తాను. మనం తీసుకొనే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనుకుంటాను.  ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ కోసం మోహన్‌లాల్‌ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఆయన రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు కాబట్టే ఈ సినిమా తెరకెక్కిందనడంలో ఆశ్చర్యం లేదు. ఆయన పారితోషికాన్ని కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టాం. స్ర్కీన్‌పై చూేస్త మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది’’ అని తెలిపారు. 

Updated Date - Mar 22 , 2025 | 10:49 AM