Gandhi Tatha Chettu: సుకుమార్ కుమార్తె నటించిన ‘గాంధీ తాత చెట్టు’ విడుదల ఎప్పుడంటే..
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:54 PM
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడి అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాను మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే..
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి. ఇప్పుడాయన కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా.. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్ర విడుదల తేదీని న్యూ ఇయర్ స్పెషల్గా మేకర్స్ ప్రకటించారు.
Also Read-కాశీ యాత్రలో రేణు దేశాయ్, అకీరా, ఆద్య.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్
‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసినా ద్వేషాలు, అసూయ.. ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి. అహింసకు బదులు హింస ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా మనకు అహింస అనగానే మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరూ ఈ సినిమాలను థియేటర్లలో చూడాలని కోరుకుతున్నానని అన్నారు. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు.