గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీకి జయసుధ సారధ్యం

ABN , Publish Date - Apr 17 , 2025 | 02:37 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ సమావేశం ఛైర్‌పర్సన్‌ జయసుధ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు అన్ని...

  • అవార్డ్స్‌కు కోసం 1248 నామినేషన్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ సమావేశం ఛైర్‌పర్సన్‌ జయసుధ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్లు అందాయి. 21వ తేదీ నుంచి నామినేషన్ల స్ర్కీనింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. పురస్కారాల కోసం వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్‌ ఫిల్మ్‌, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్‌ క్రిటిక్స్‌, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 దరఖాస్తులొచ్చినట్లు జ్యూరీ వెల్లడించింది. సమావేశం సందర్భంగా జయసుధ మాట్లాడారు. తనకు అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకొని ఫిల్మ్‌ అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డులు ఇవ్వనుందని, ఉమ్మడి రాష్ట్రంలోనూ చలనచిత్ర పురస్కారాల కోసం ఇంత విశేష స్థాయిలో స్పందన రాలేదన్నారు. నామినేషన్లను జ్యూరీ నిష్పాక్షికంగా పరిశీలించాలని.. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను ఆయన కోరారు.

Updated Date - Apr 17 , 2025 | 02:37 AM