Ilaiyaraaja: నా సంగీతానికి ఏనుగులు వచ్చాయి..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:48 AM
ఇళయరాజాని మ్యూజికల్ గాడ్ అంటారు. ఆయన స్వరపరిచిన పాటల్లో ఎదో మహత్తు ఉంటుంది. పాట పాతదే అయినా, అది వచ్చిన ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి అదే ఫీల్, ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా అదే మ్యాజిక్, ఎమోషన్ కనెక్ట్ అవుతుంది.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రతిభ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఆయన సంగీతానికి పరవశించని వారు ఉండరు. యావత్ ప్రపంచం మొత్తం ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన 1500 సినిమాలకు 7 వేలకు పైగా పాటలను అందించారు. ఇక ఆయన ప్రపంచంలో ఎక్కడ సంగీత కచేరి(కన్సర్ట్) పెట్టిన వేళల్లో, లక్షల్లో అభిమానులు హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు ఆయనపై విమర్శలు చేస్తుంటే.. మరి కొందరు సమర్థిస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. " నా సంగీతానికే కాదు, నా ప్రతిభకు కూడా నేను గర్వపడతా. నాకు పొగరు ఉంది, ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుంది. నా సంగీతం విని ఒక చిన్నారి తిరిగి శ్వాస తీసుకుంది. ఒకసారి నా సంగీతం వినడానికి ఏనుగుల గుంపు వచ్చింది. నా సంగీతం వినడమే ఒక కళ. నేను కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశా" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలామంది విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన సాధించిన ఘనతకు అలా మాట్లాడటం సబబే అంటున్నారు.
1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన కేవలం తమిళ్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ తోపాటు పలు భాషల్లో సంగీతం అందించారు. ఎందరో గాన గంధర్వులు కూడా ఇళయరాజా ముందుంటే సాధారణ కళాకారుడిగానే కనిపిస్తాడని చాలా మంది అభిప్రాయపడతారు. ఆయన భారతీయ సంగీత ప్రపంచానికి ఎన్నో వైవిధ్యమైన, ఇండో వెస్ట్రన్, కర్నాటిక్, హిందుస్తానీ సంగీతం అందించారు.