Shalini Pandey: కారవాన్లో దుస్తులు మార్చుకుంటుంటే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:41 PM
షబానా అజ్మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని షాలినీ పాండే చెప్పారు. అలాగే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ దక్షిణాది దర్శకుడి వల్ల ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలినీ పాండే (Shalini Panday) తాజాగా ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) వెబ్సిరీస్తో అలరించారు. షబానా అజ్మీ, జ్యోతిక కీలక పాత్రల్లో నటించిన సిరీస్ ఇది. నెట్ప్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చిత్రీకరణ సందర్భంగా షబానా అజ్మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు. అలాగే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ దక్షిణాది దర్శకుడి (South Director) వల్ల ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.
‘‘జబల్పుర్కు చెందిన నేను.. సినిమాల్లో రాణించాలనే ఆశతో కుటుంబాన్ని వదిలేసి వచ్చాను. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫేస్బుక్లో నా ఫొటోలు చూసి ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం ఇచ్చారు. ఆయన టీమ్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు నిజమేనా? కాదా? అని కూడా ఆలోచించలేదు. ఫొటోలు అచి?గారు పంపించేశాను. అలా, ‘అర్జున్ రెడ్డి ’తో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా. ఈ జర్నీలో తోటి నటీనటులు, దర్శక-నిర్మాతలు నాకెంతో సపోర్ట్గా నిలిచారు. ఆయా సినిమాలకు సంబంధించి నా అభిప్రాయాలను చాలా గౌరవించారు. అయితే, ఈ ప్రయాణంలో నేనూ సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు.. ఆ దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డా. కారవాన్లో నేను దుస్తులు మార్చుకుంటున్న సమయంలో నా అనుమతి లేకుండానే దర్శకుడు డోర్ తీశాడు. నాకెంతో కోపం వచ్చింది. వెంటనే ఆయనపై కేకలు వేశా. దాంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లు అలా ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదన్నారు. నాకు మాత్రం తప్పుగా అనిపించలేదు. ఆ తర్వాత నాకెప్పుడూ ఆ విధమైన సమస్య ఎదురుకాలేదు. ఒకవేళ ఎదురైనా ముఖంపైనే కోప్పడకుండా వారికి ఏవిధంగా సమాధానం చెప్పాలో తెలుసుకున్నా’’ అని షాలినీ పాండే అన్నారు.