Ram Gopal Varma: ఎక్కడున్నావ్ వర్మ.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:32 PM
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం పోలీసులు ఒకవైపు చర్యలు చేపడుతుంటే.. ఆయన మాత్రం వరుస వీడియోలతో చెలరేగిపోతున్నారు. ఆర్జీవీ ఇంకా ఆజ్ఞతంలోనే ఉండటంతో అటు ఆయన ఫ్యాన్స్, ఇటు పోలీసులు వర్మ రాక కోసం వెయిట్ చేస్తున్నారు.
సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ (Ram Gopal Varma) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు (Ongole Police) గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాది బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై గురువారం విచారణ జరగనుంది. ఈనెల 25న ఒంగోలు పీఎస్లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా.. అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. బుధవారం మరో వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలు ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది విచారిస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియగా ఉన్నారు. వర్మకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లభిస్తే రాంగోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకి వస్తారా.. బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది ఉత్కంఠంగా మారింది. రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు మద్దిపాడులో నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు రానుంది.
తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ.. పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని.. తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
‘‘నాకు నా మనుషులకు ఉన్న అనుమానం ఎంటంటే.. పీడించటానికే ఓ పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న చట్టాలను వాడుతున్నారా.. ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు.. అది అమెరికా యూరప్లతో పాటు ఇక్కడా జరుగుతోంది. దీనిపై నేను ఏ ఒక్క పొలిటీషియన్ను, పొలీస్ ఆఫీసర్ను బ్లేమ్ చేయటం లేదు.. కానీ ఈవేలో ఖచ్చితంగా చెయ్యెచ్చు.. చెయ్యాలనే టెంప్టింగ్ ఉండొచ్చు... కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది .. పౌరులకు కట్టుబడి ఉంది కూడా.. నాకొక నోటీస్ వచ్చింది. పలానా తారీఖున వస్తానని రిప్లై ఇచ్చాను.. సినిమా వర్క్ ఉండటం వెళ్లటం అవ్వలేదు. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు మరలా టైమ్ అడిగాను.. ఇదేమి అర్జెంట్ కేసు కాదు. వన్ ఇయర్ బ్యాక్ ట్వీట్ చూసిన వాడికి.. వన్ వీక్ లో అంతా అయిపోవాలని ఎమన్నా ఫీలింగ్ ఉంటుందా.. మర్డర్ కేసులకే సంవత్సరాల సమయం తీసుకుని.. నా కేసులో ఎందుకు అత్యవసరంగా వ్యవహరిస్తున్నారు’’.. అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.