Devara: సెలబ్రిటీల మౌనం ఎందుకు.. రాజమౌళికి నచ్చలేదా

ABN , Publish Date - Sep 30 , 2024 | 08:50 PM

ఎన్టీఆర్‌ (Jr ntr) 'దేవర’ (Devara) విడుదలై నాలుగు రోజులు అవుతోంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయ్‌ అంటూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేస్తోంది

ఎన్టీఆర్‌ (Jr ntr) 'దేవర’ (Devara) విడుదలై నాలుగు రోజులు అవుతోంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయ్‌ అంటూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేస్తోంది. మూడు రోజులకు 304 కోట్లు వసూలు చేసినట్లు టీమ్‌ పోస్టర్‌ విడుదల చేసింది. అయితే ఈ వసూళ్లు నిజమేనా? లేక కావాలనే ఇలా చేస్తున్నారా? అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి టాలీవుడ్‌లో సినిమా చిన్నదైనా, పెద్దదైనా బావుంటే సెలబ్రిటీలు ,తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఆయా చిత్ర బృందాలకు అభినందనలు తెలియజేస్తుంటారు. చిరంజీవి, మహేష్‌,  అల్లు అర్జున్‌ లాంటి హీరోల నుంచి రాజమౌళి (rajamouli)వంటి అగ్రదర్శకుల వరకూ ట్వీట్‌ ద్వారా విష్‌ చేస్తుంటారు. కానీ దేవర విడుదలై వారాంతం ముగిసినా ఇంకా ఆ తరహా స్పందన రాలేదు. చిరంజీవి వంటి వారు ఐఫా వేడుక కోసం అబుదాబిలో ఉండి కుదరకపోవచ్చు. ఇతర హీరోలు షూటింగ్‌లతో బిజీగా ఉండొచ్చు. ఆ కారణంగా సినిమా చూడలేదనుకోవచ్చు. కానీ తారక్‌కు అత్యంత ఆప్తుడు అయిన రాజమౌళి తొలిరోజునే సినిమా చూశారు. కానీ ఇప్పటికే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జక్కన్నకు  సినిమా నచ్చలేదా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి కొడుకు కార్తికేయ మాత్రం 23 ఏళ్ల రాజమౌళి సెంటిమెంట్‌ను దేవరతో  బీట్‌ చేశాడని ట్వీట్‌ చేశాడు. దేవర .. ఎందుకో ఎన్టీఆర్‌ హార్డ్‌ కోర్‌  అభిమానులను ఆకట్టుకోలేకపోయిందని పబ్లిక్‌లో టాక్‌ నడుస్తోంది. దేవర రిలీజ్‌ ముందు వరకు టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సెలబ్రిటీలు .. దేవర రిలీజ్‌ అనంతరం ఒక్కసారిగా మౌనం వహిస్తుంటే దేవర పూర్తిస్థాయిలో ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందా అనే చర్చ నడుస్తోంది. 

Updated Date - Sep 30 , 2024 | 08:51 PM