Manchu Manoj: జానీ మాస్టర్‌ కోసం మంచు మనోజ్‌ ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:54 PM

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani master) లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిని పై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు.


డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani master) లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిని పై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘‘జానీ మాస్టర్‌.. కెరీర్‌ పరంగా ఈ స్థ్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు మీపై ఇలాంటి ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. తప్పు, ఒప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. జానీ మాస్టర్‌.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే.. దానిని అంగికరించండి’’ అని పోస్ట్‌లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌లకు అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ని వెంటనే సిద్థం చేయాలని కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్‌మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. ఇబ్బందుల్లో ఉన్న మహిళల బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, కో వర్కర్స్‌కు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం. కూతురు, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం’’ అని మనోజ్‌ కోరారు.


బాధిత కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఇచ్చిన ఫిర్యాదులో ఏం చెప్పిందంటే..

‘‘2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో అసిస్టెంట్‌గా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తోపాటు నేను, మరో ఇద్దరు అసిస్టెంట్స్‌ వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై   అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే టీమ్‌ నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేదని బెదిరించసాగాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ కారావ్యాన్‌లో ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడు. తన లైంగిక వాంఛలు తీర్చిమని కోరాడు. అలా చేయనుందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి వేసి కొట్టాడు. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ప్రెజర్‌ చేశాడు. ఆ వేధింపులు భరించలేక అతని టీమ్‌ నుంచి బయటకొచ్చేశాను. నన్ను సొంతంగా పని చేసుకో నివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్‌ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో రాసి ఉంది’’ అని సదరు లేడీ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు ఆరేళ్లగా జానీ మాస్టర్‌ బృందంలో పని చేసిన బాధితురాలు అతని టీమ్‌ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా కొరియోగ్రఫీ మొదలుపెట్టింది. శర్వానంద్‌ నటించిన మనమే చిత్రానికి ఆమె కొరియోగ్రఫీ చేసింది. ఈ ఏడాది ప్రకటించిన 70వ జాతీయ పురస్కారాల్లో జానీ మాస్టర్‌ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వరించింది. ధనుష్‌, నిత్యామీనన్‌ నటించిన తమిళ చిత్రం 'తిరుచిత్రంబలం’ చిత్రానికిగానూ ఆయనకు జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు.

Updated Date - Sep 19 , 2024 | 04:26 PM