Dil Raju Comments: మీరు ఇంట్లో కూర్చోండి.. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తామన్నాం.. ఇదే సమస్య!

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:28 PM

"ఆడియన్స్ ని  సినిమా థియేటర్‌లు రాకుండా నిర్మాతలుగా మేమే చెడగొట్టామని అగ్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju Comments) అన్నారు. నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి (ott) తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ‘రేవు’ (Revu Trailer) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన చెప్పారు.

"ఆడియన్స్ ని  సినిమా థియేటర్‌లు రాకుండా నిర్మాతలుగా మేమే చెడగొట్టామని అగ్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju Comments) అన్నారు. నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి (ott) తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ‘రేవు’ (Revu Trailer) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన చెప్పారు. ఓటీటీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం  ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ‘‘కొత్తవాళ్లతో సినిమాలు తీసే ప్రక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ, 99శాతం ఫెయిల్‌ అవుతాయి. ఒక శాతం మాత్రమే సక్సెస్‌ రేట్‌. కెరీర్‌ తొలినాళ్లలో నేను సినిమాలు  తీసేటప్పుడు నా సినిమాకు ఆడియన్స్‌ ఎలా వస్తారు? ఇంకా ఏమేం యాడ్‌ చేయాలి? అనుకుంటూ సినిమా తీసేవాడిని. ఈ రోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే పెద్ద సవాల్‌ మేము తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్‌ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా  ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది మేమే.. ‘మీరు ఇంట్లో కూర్చోండి.. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం. ఈ సినిమా (రేవు) చూసి నేను కూడా రివ్యూ ఇస్తా.  ఇది మంచి సినిమా.. అదీ చిన్న మూవీ అయితే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి’’ అని దిల్‌రాజు అన్నారు.

దిల్‌రాజు వ్యాఖ్యలపై అటు ఇండస్ట్రీతో పాటు, ఇటు సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడుస్తోంది. కరోనా తర్వాత వందల చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. థియేట్రికల్‌ రన్‌ బాగున్న సినిమాలు కూడా ముందుగానే  స్ట్రీమింగ్ కు  వచ్చేశాయి. సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థలతో చిత్ర బృందాలు చేసుకున్న ఒప్పందాల కారణంగా రాక తప్పని పరిస్థితి. ‘సలార్‌’, ‘టిలు స్వ్క్వేర్‌’, ‘ది ఫ్యామిలీ స్ట్టార్‌’ వంటి చిత్రాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా త్వరగా ఓటీటీలోకి వచ్చాయి. ఈ ఏడాది ‘హనుమాన్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మాత్రం ఓటీటీలోకి రావడానికి కాస్త సమయం పట్టింది. కొన్ని చిత్ర పరిశ్రమలు ఓటీటీలో  స్ట్రీమింగ్  విషయంలో కచ్చితంగా ఉంటున్నాయి. కనీసం 50 రోజులు పూర్తయిన తర్వాతే ఓటీటీలో వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కథానాయకులకు సంబంధించిన ఏ సినిమా అయినా విడుదలైన తేదీ నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. మలయాళంలో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు.


పెరుగుతున్న ఓటీటీలు, అందులో   స్ట్రీమింగ్  అవుతున్న ఆకట్టుకునే కంటెంట్‌, సిరీస్‌లకు ఎట్రాక్ట్‌ అయిన ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం తగ్గించేశాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. టికెట్‌ ధరలు, పార్కింగ్‌ వసూళ్లు, తినుబండారాల ధరలు వెరిగిపోయాయి. చిన్న  కుటుంబ సినిమా చూడాలంటే  రూ.2000 ఖర్చు చేయాల్సిందే. వీటిని నియంత్రిస్తే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడన్నది సామాన్యుడు చెబుతున్న మాట. స్టార్  హీరోల సినిమాలు విడుదలైన తొలిరోజుల్లో అత్యధిక ధరలు ఉండటం సహజం. అయితే, ఆ తర్వాత టికెట్‌ ధరలు అందుబాటులోకి తెస్తే సినిమా చూేసవాళ్లు పెరుగుతారు. కనీసం ఒక వారం లేదా.. వారంలో ఒక రోజు టికెట్‌ ధరను రూ.100కు కాస్త అటూ ఇటూ పెడితే, ప్రేక్షకులు థియేటర్‌పై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ మధ్యన విడుదలై హిట్‌ అయిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర బృందం అదే పని చేసింది. దీనిపై నిర్మాతలంతా ఓ మాట మీద నిలబడి సరైన చర్యలు తీసుకుంటే బావుంటుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 17 , 2024 | 04:28 PM