Nindha: నాకు స్వామిరారా, కార్తికేయ.. వరుణ్ సందేశ్‌కు ‘నింద’: నిఖిల్ సిద్దార్థ్

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:30 PM

వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

Nindha: నాకు స్వామిరారా, కార్తికేయ.. వరుణ్ సందేశ్‌కు ‘నింద’: నిఖిల్ సిద్దార్థ్
nindha

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘నింద’ (Nindha).ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోండ‌గా ఆదివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) మాట్లాడుతూ.. ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలి. నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలన్నారు. ఈ మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని.. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారన్నారు. చాలా క్వాలిటీతో సినిమాను తెరకెక్కించారని ఈమూవీతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోందన్నారు.

Varun-Sandesh-nindha.jpg

వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడుతూ.. ‘నిఖిల్ ఎదుగుదలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నిఖిల్, నేను కలిసి 2007లో హ్యాపీడేస్ చేశాం. అప్పుడు నా వయసు 17. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు వచ్చాం. దాదాపు నా సగం లైఫ్ సినిమా ఇండస్ట్రీలోనే గడిచింది. గత ఏడేళ్లుగా నా భార్య వితిక నాకు అండగా ఉంటూ వచ్చింది. నింద నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఎంతో కంఫర్టబుల్‌గా జీవితాన్ని గడుపుతున్న రాజేష్ తన ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయనకు తన కథ మీద చాలా నమ్మకం ఉంది. ఎంతో గట్స్, కాన్ఫిడెన్స్ తో నిర్మించారు. టీం అంతా కూడా సింక్‌లో ఉండి పని చేసింది. అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు.


ఈ సినిమాను ఇండస్ట్రీలోని కొంత మందికి చూపించాకా మాలో మరింత పాజిటివిటీ పెరిగింది. మైత్రీ వారు మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం తరువాత రాజేష్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా, మంచి దర్శకుడిగా, నిర్మాతగా నిలబడతార‌న్నారు. రమీజ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. సాంతు ఓంకార్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎంతో ఇంటెన్స్‌గా బాగుంటుంది. అనిల్ ఎడిట్ సూపర్బ్‌గా ఉంటుంది. శ్రేయా, అన్నీ, మధు అందరూ చక్కగా నటించారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. నెక్స్ట్ ‘నింద’ అని గర్వంగా చెప్పుకోగలను. మా బామ్మ ఈ మూవీ చూశారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు ఈ మూవీ నచ్చుతుంది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

WhatsApp Image 2024-06-17 at 10.57.50 AM (1).jpeg

దర్శక, నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్ గారికి థాంక్స్. నా తల్లిదండ్రులు, భార్య వల్లే ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాను. ఈ మూవీ అవుట్ పుట్ చూశాక నాకు చాలా సంతృప్తి కలిగింది. అదే నేను సాధించిన విజయం అనిపించింది. చిన్నారావు గారు నా వెన్నంటే ఉండి నడిపించారు. శిరీష గారు నాకు రైటింగ్‌లో హెల్ప్ చేశారు. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సాంతు, ఎడిటర్ అనిల్, కెమెరామెన్ రమీజ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్. అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లకు థాంక్స్. నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ వారి వారి పాత్రలతో ఆడియెన్స్‌కు గుర్తుండిపోతారు. ఈ చిత్రంతో నాకు వరుణ్ లాంటి మంచి బ్రదర్ దొరికాడు. అతను చాలా మంచి వ్యక్తి. హిట్లు లేనప్పుడే మనిషి వ్యాల్యూ తెలుస్తుంది. ఆయన ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తాడు. నింద మూవీతోనే దానికి నాంది పడుతుంద‌న్నారు.

శ్రేయా రాణి మాట్లాడుతూ.. ‘నాకు ఇది మొదటి సినిమా. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన రాజేష్ గారికి థాంక్స్. నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. వరుణ్ సందేశ్ సర్ ఎంతో సపోర్ట్ చేశారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు. నటి అన్నీ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్ గారికి థాంక్స్. నాకు సుధ లాంటి మంచి పాత్రను ఇచ్చిన రాజేష్ గారికి థాంక్స్ అని అన్నారు. మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ గారు నాకు ఈ సినిమాను చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్‌ప్రైజ్ అవుతారు’ అని అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 06:11 PM