Ajith: ట్రావెలింగ్‌ సూక్తి.. నెటిజన్లు ఫిదా అంతే..

ABN , Publish Date - Oct 05 , 2024 | 09:39 PM

తమిళ స్టార్‌ అజిత్‌కు (Ajith) ట్రావెలింగ్‌ అంటే ఎంతిష్టమో తెలిసిందే. సినిమా షూటింగ్‌లు పూర్తయ్యాక ఆయన లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తుంటారు.



తమిళ స్టార్‌ అజిత్‌కు (Ajith) ట్రావెలింగ్‌ అంటే ఎంతిష్టమో తెలిసిందే. సినిమా షూటింగ్‌లు పూర్తయ్యాక ఆయన లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తుంటారు. అది కూడా ఆయన దగ్గరున్న బైక్‌లపై. తాజాగా వెళ్లిన ఓ ట్రిప్‌ విశేషాలను తెలియజేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో అజిత్‌ ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. ట్రావెలింగ్‌ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయన్నారు.

‘‘మనం చేసే ప్రయాణం.. (Travel) ఉత్తమ విద్యను అందిస్తుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను బాగా నమ్ముతాను కూడా. మతం, వర్గం ఇలా వివిధ కారణాల వల్ల మనతో పరిచయం లేని వారిని కూడా మనం ద్వేషిస్తుంటాం అని ఒక సూక్తి ఉంది. అది నిజం. పరిచయం లేనప్పటికీ ఎదుటివారిని జడ్జ్‌ చేస్తుంటాం. కానీ, మీరు ప్రయాణించినప్పుడు, వివిధ ప్రాంతాల మతాలకు చెందిన వారిని కలుస్తుంటాం. వారి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. దానివల్ల ఇతరులపై సానుభూతి ఏర్పడుతుంది. తద్వారా మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు’’ అని అజిత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆయన ఇచ్చిన సందేశానికి నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు.  

ఇక అజిత్‌ సినిమాల సంగతికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘విదా ముయార్చి’ (Vidaamuyarchi) సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు. ఇది నటిస్తోన్న 62వ సినిమా. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయిక. మరోవైపు, ఆయన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - Oct 05 , 2024 | 09:39 PM