Suresh Gopi: సమస్య కోర్టు పరిధిలో ఉంది.. నిజానిజాలు తెలుస్తాయి

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:59 PM

ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ హాట్‌ టాపిక్‌.. హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Commitee Report). అన్ని చిత్ర పరిశ్రమలను కకావికలం చేస్తోంది.

ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ హాట్‌ టాపిక్‌.. హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Commitee Report). అన్ని చిత్ర పరిశ్రమలను కకావికలం చేస్తోంది. నటులు, దర్శకుల నుంచి మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని హేమ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి సురేశ్‌ గోపీ (Suresh Gopi) స్పందించారు. ఈ అంశంపై మీడియా చేస్తున్న ప్రచారంపైన ఆయన మండిపడ్డారు. ‘‘చిత్రసీమలో వస్తున్న లైంగిక ఆరోపణలు గురించి మీడియా చేస్తున్న ప్రచారం ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఈ ఆరోపణలే మీడియాకు ఆహారం పెడుతున్నాయి. మీరు డబ్బు సంపాదించేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారని అర్థమవుతోంది. అయితే.. వాస్తవాలు ఏంటో తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు’’ అని సురేశ్‌ గోపీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానమిచ్చారు. ‘‘మీ స్వలాభం కోసం అలజడి సృష్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. వారి అభిప్రాయాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు న్యాయస్థానం కంటే గొప్ప కాదు. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. నిజానిజాలు తెలుస్తాయి. అంతవరకు వేచి ఉండండి. న్యాయస్థానాన్ని ఓ నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని అన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:06 PM