Actor Darshan: వాళ్లే హత్య చేసి.. నా తలకు చుట్టారు

ABN , Publish Date - Jun 16 , 2024 | 02:41 PM

తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.

Actor Darshan:  వాళ్లే హత్య చేసి.. నా తలకు చుట్టారు


తన అభిమాని రేణుకా స్వామిని (Renuka Swami) హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌ (Darshan), ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో (Pavithra gowda) కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. కస్టడీ సమయం సోమవారం వరకు ఉన్నప్పటికీ.. వారిని శనివారమే న్యాయస్థ్థానానికి తీసుకొచ్చారు. బక్రీదు, తొలి ఏకాదశి సెలవు ఉండడంతో ముందుగానే వారిని కోర్టులో హాజరు పరిచామని పోలీసులు తెలిపారు. అంతకు మునుపు నిందితులకు వైద్య పరీక్షలను చేయించారు. ‘విచారణ సమయంలో పోలీసులు నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురైందా’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని నిందితులు స్పష్టం చేశారు. వారిని జూన్‌ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు నుంచి నేరుగా అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌ స్టేషనకు తరలించారు. స్టేషనకు చేరుకున్న అనంతరం పవిత్రా గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌కు చేర్చారు. హత్యకు మునుపు, అనంతరం నిందితుల వాట్సప్‌ చాట్‌ హిస్టరీ, కాల్‌ డేటాను రాబట్టే ప్రయత్నాలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలు నిపుణులు కొనసాగించారు. దర్శన్‌ను న్యాయనిర్భంధానికి పంపించే అవకాశం కూడా ఉండడంతో పరప్పన అగ్రహార కారాగారం వద్ద పోలీసులు ముందస్తుగా భద్రతను ఏర్పాటు చేశారు. రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటి వరకు లొంగిపోయిన ఐదుగురుతో కలిసి 16 మందిని అరెస్టు చేశామని డీసీపీ గిరీశ్‌ తెలిపారు.

దర్శన్‌, నటి పవిత్రాగౌడ, పవన్‌, ప్రదోశ్‌, నందీశ్‌, కేశవమూర్తి, రాఘవేంద్ర, ఎం లక్ష్మణ్‌, దీపక్‌ కుమార్‌, కార్తిక్‌, ఆర్‌ నాగరాజ్‌, వి.వినయ్‌, నిఖిల్‌ నాయక్‌, అనుకుమార్‌, రవి, జగదీశ్‌లను నిందితులుగా గుర్తించామన్నారు. హత్యలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు తీవ్రం చేశామని చెప్పారు. రేణుకా స్వామి చిత్రదుర్గలో అపహరించుకుని, బెంగళూరులోని పట్టణగెరెలోని షెడ్డులో ఉంచి చిత్రహింసలు పెట్టారని గుర్తించామని పోలీసులు చెప్పారు. తాను శాకాహారిని అని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించారని వివరించారు. దాన్ని తినకుండా ఉమ్మేయడంతో మళ్లీ కొట్టారని చెప్పారు. ‘మాంసం తింటే శక్తి వస్తుంది.. బాస్‌ కొడితే తట్టుకోవచ్చు’ అంటూ నిందితుల విచారణలో తెలిసింది. కిడ్నాప్‌ చేసినప్పటి నుంచి బెంగళూరుకు తీసుకురావడం, షెడ్డులో దాడి చేయడానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనపరుచుకుని పరిశీలించారు. హత్య చేేసందుకు ముందుగా రేణుకాస్వామికి విద్యుత్తు షాకు కూడా ఇచ్చారని గిరీశ్‌ తెలిపారు.

Pavithra.jpg
అసలు గొడవ ఎక్కడ స్టార్‌ అయిందంటే... పవిత్రా గౌడకు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకాస్వామిపై చేయి చేసుకున్నానంటూ విచారణ చేస్తున్న పోలీసులకు దర్శన్‌ వివరించాడు. రెండు దెబ్బలు కొట్టి, షెడ్డు నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి, తన తలకు చుట్టారని చెప్పారు. ుఅతన్ని తీసుకువచ్చేంత వరకు నాకు ఈ విషయం తెలియదు. అతన్ని బెంగళూరుకు తీసుకువచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్లారు. అతనితో పవిత్రా గౌడకు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లాను. నన్ను, పవిత్రను చూసిన వెంటనే తప్పయిందని.. చేతులు జోడించాడు. రెండు దెబ్బలు కొట్టాను.  జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి, ఇంటికి వచ్చేశాను’ అని పోలీసులకు దర్శన్‌ వివరించాడు.

మరో వైపు రేణుకాస్వామిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని బెంగళూరు, మండ్య, చిత్రదుర్గ, దావణగెరె జిల్లాల్లో వివిధ పౌర సంఘాల ప్రతినిధులు తమ ఆందోళనలను కొనసాగించారు. హతుడు రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు రూ.5 లక్షల పరిహారాన్ని అందించారు. 

Updated Date - Jun 16 , 2024 | 02:41 PM