ప్రైవేట్ సాంగ్స్కు సై
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:59 AM
మ్యూజిక్ వీడియో, ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్... పేరేదైనా వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శ్రోతల నుంచి భారీ స్పందన లభించడంతో ప్రైవేట్ సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అద్భుతమైన విజువల్స్కు తోడు...
మ్యూజిక్ వీడియో, ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్... పేరేదైనా వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శ్రోతల నుంచి భారీ స్పందన లభించడంతో ప్రైవేట్ సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అద్భుతమైన విజువల్స్కు తోడు మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కుతుండడంతో మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. అందుకే కొంతకాలంగా కథానాయికలు ప్రైవేట్ సాంగ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో ఇలాంటి వీడియోలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పుడిప్పుడే సౌత్లోనూ ఈ ట్రెండ్ పుంజుకుంటోంది. మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లు సైతం మ్యూజిక్ ఆల్బమ్స్తో అభిమానులను అలరిస్తున్నారు. యూట్యూబ్లో ఈ మ్యూజిక్ ఆల్బమ్స్కు మంచి ఆదరణ దక్కుతోంది.
హీరోయిన్గా అరంగేట్రం చేయకమునుపే గాయనిగా, సంగీత దర్శకురాలిగా చక్కని గుర్తింపు పొందారు శ్రుతీహాసన్. తనతండ్రి కమల్హాసన్ నటించిన ‘ఈనాడు’ చిత్రానికి సంగీతం అందించారు. కరోనా టైమ్లో ‘ఎడ్జ్’ పేరుతో ఆమె వీడియోసాంగ్ను రూపొందించి యూట్యూబ్లో విడుదల చేయగా అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో కలసి ‘ఇనిమేల్’ పేరుతో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ గీతానికి కమల్హాసన్ సాహిత్యం అందించారు. శ్రుతీ సంగీతం సమకూర్చారు. కమల్హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది. ప్రేమికుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాటలో ఆవిష్కరించిన తీరు అభిమానులను అలరించింది.
ప్రస్తుతం రాజ్తరుణ్ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాల్వీ మల్హోత్రా. తాజాగా ఆమె నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ‘షహబానో’ విడుదలైంది. ఈ సాంగ్కు యశ్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. హిమాలయాల్లోని మంచు పర్వతాల్లో ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాటకు రెండో పార్ట్ కూడా ఉందని ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేశారు.
తమిళంలో రజనీకాంత్, ధనుష్, విజయ్ లాంటి స్టార్స్ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంతో టాలీవుడ్కు కథానాయికగా ఆమె పరిచయమవుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఓ ప్రైవేట్ సాంగ్లో మెరిశారు మాళవిక. బాలీవుడ్లో ఈ అమ్మడు చేసిన ‘తౌబా’ సాంగ్ సన్షేషన్ సృష్టించింది. 60 మిలియన్లకు పైగా వ్యూస్ను ఈ పాట సొంతం చేసుకొంది.
‘కలియుగంలో పట్ణణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గుజరాతీ భామ ఆయుషి పటేల్. ‘చూసుకో నీలోకి’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్లో ఆమె మెరిశారు. హీరో త్రిగుణ్ ఈ గీతంలో ఆయుషికి జోడీగా కనిపించారు. కేరళలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన గీతం యూట్యూబ్లో చక్కటి ఆదరణ పొందుతోంది.
రవితేజ హీరోగా వచ్చిన ‘నేల టికెట్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు మాళవిక శర్మ. ఆ తర్వాత రామ్ సరసన ‘రెడ్’ చిత్రంలో కనిపించారు. రెండేళ్ల క్రితమే ‘బారీషోంమే’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్ను చేశారు. వర్షం నేపథ్యంలో ప్రేమికుల భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది.
కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటి ఇలియానా గతేడాది ఓ ప్రైవేట్ సాంగ్లో మెరిశారు. ఆల్బంసాంగ్స్ చేసే మంజిత్సింగ్, సుఖ్జిత్సింగ్తో కలసి ‘సబ్ గజబ్’ అనే సాంగ్ చేశారు ఇలియానా. ఇది యూట్యూబ్లో మంచి వ్యూయర్షి్పను సొంతం చేసుకుంది.