సామాజిక బాధ్యతతో సినిమా తీశాం
ABN , Publish Date - Feb 14 , 2024 | 06:09 AM
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. అఖిలన్, వీణ, వినోద్కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 15న చిత్రం...

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. అఖిలన్, వీణ, వినోద్కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 15న చిత్రం విడుదలవుతున్న సందర్బంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఇందులో నిర్మాత మాట్లాడుతూ ‘రైతులు స్వఛ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే దానిని ఎగతాళి చేస్తూ, వారిని మానసిక క్షోభకు గురి చేసిన సంఘటనలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. దానిని స్ఫూర్తిగా తీసుకుని రైతుల పక్షాన ఒక సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. రైతుల కన్నీళ్లు తుడిచే విధంగా సమాజాన్ని చైతన్యపరుస్తూ ఓ సామాజిక బాధ్యతతో ఈ సినిమా నిర్మించాం.. దర్శకుడు భాను అద్భుతంగా తీశారు. సినిమాకు అఖండ విజయం అందించి రైతులకు సంఘీభావం తెలియజేయాలి’ అని కోరారు. ఇందులో తను రైతు పాత్ర పోషించాననీ, ఇది పొలిటికల్ ఫిల్మ్ కాదనీ, రైతుల ఆవేదనని తెలియజేసే కథ అని వినోద్కుమార్ చెప్పారు. ఈ సినిమాలో తను భాగం అయినందుకు ఆనందంగా ఉందని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఏడు వందల మంది రైతులతో ఈ సినిమా తీశామని దర్శకుడు భాను చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు ఇందులో నటించారని తెలిపారు. అందరికీ ఉపయోగపడే సినిమా ఇదన్నారు.