నటుడిగా సైంధవ్ సంతృప్తిని ఇచ్చింది
ABN , Publish Date - Jan 07 , 2024 | 02:56 AM
‘తెలుగు సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. సరైన కథ కుదరడంతో ‘సైంధవ్’తో అరంగేట్రం చేస్తున్నాను. వెంకటేశ్తో పనిచేయడం ఎవరికైనా ఒక డ్రీం. ఆయనతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది’...

‘తెలుగు సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. సరైన కథ కుదరడంతో ‘సైంధవ్’తో అరంగేట్రం చేస్తున్నాను. వెంకటేశ్తో పనిచేయడం ఎవరికైనా ఒక డ్రీం. ఆయనతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రమిది. నవాజుద్దీన్ విలన్గా నటించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
కొన్నిసార్లు నెగిటివ్ పాత్రల్లోనే నటనకు ఎక్కువ ఆస్కారముంటుంది. పాత్ర ఆసక్తికరంగా ఉంటే హీరోనా, విలనా అనేది పట్టించుకోను. ఇందులో నా పాత్రను శైలేష్ కొత్త తరహలో తీర్చిదిద్దారు. నటుడిగా ఈ సినిమా చాలా సంతృప్తిని ఇచ్చింది. నా పాత్రకు ఇతరులు ఎవరో డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. భాషను భావాన్ని అర్థం చేసుకొని తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ప్రతి డైలాగ్ను బాగా సాధన చే శాను. కష్టంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ చేయడం సవాల్గా అనిపించింది. సముద్రంలో బోట్పై యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు భారీ అల వచ్చి నన్ను పైకి లేపింది. పై ప్రాణాలు పైనే పోయాయి. అదృష్టవశాత్తూ మళ్లీ బోట్లోనే పడ్డాను.
సెట్లో వెంకటేశ్ చాలా ప్రశాంతంగా ఉంటారు. డైలాగ్స్ బాగా సాధన చేసి షూటింగ్కి వస్తారు. రిస్క్తో కూడిన యాక్షన్ సీన్స్ చేశారు. ఆయన నుంచి సహనం నేర్చుకోవాలి. వెంకటేశ్ను ఈ చిత్రంలో సరికొత్తగా చూడబోతున్నారు. శైలేష్ ప్రొఫెషనల్ డైరెక్టర్. కథకు మెరుగులు అద్దడంలో దిట్ట. కథను చెప్పినంత అద్భుతంగా సినిమాను మలిచాడు. టాలీవుడ్ పరిశ్రమ సమయపాలనకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడి దర్శకులు, నటులతో పనిచేయాలనుంది. అవకాశం వస్తే ఓషో బయోపిక్ చేయాలనేది నా కోరిక.