Prabhas: ప్రభాస్ బంధువు విరాట్ రాజ్ కథానాయకుడిగా ఆరంగేట్రం
ABN , Publish Date - Apr 10 , 2024 | 11:48 AM
ఇంకొక కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారనున్నారు. ప్రభు దేవా, రాఘవ లారెన్స్, అమ్మ రాజశేఖర్, రాజు సుందరం, విజయ్ బిన్నీ ఇలా చాలామంది కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారారు, ఇప్పుడు అదే వరసలో గణేష్ మాస్టర్ కూడా చేరనున్నారు.

ఎన్నో తెలుగు సినిమాలలో, ఎందరో అగ్ర నటుల పాటలకు తనదైన స్టైల్ లో కోరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా మారనున్నాడు. గణేష్ మాస్టర్ తెలుగు పరిశ్రమలో ఎంతో బిజీగా వుండే కొరియోగ్రాఫర్ కూడాను. అటువంటి గణేష్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా ఒక కొత్త నటుడిని తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు, ఆ నటుడు మరెవరో కాదు, రెబల్ స్టార్ ప్రభాస్ కి సమీప బంధువు, విరాట్ రాజ్.
ఈరోజు అతిరధ మహారధులు హాజరై గణేష్ మాస్టర్ కి తమ శుభాకాంక్షలు తెలిపారు. అందులో అగ్ర దర్శకుడు సుకుమార్, ఇంకో దర్శకుడు అనిల్ రవిపూడి వున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది గణేష్ మాస్టర్ కి, విరాట్ కి తమ శుభాకాంక్షలని తెలిపారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎక్కువగా చేశారు. 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' 'వకీల్ సాబ్', ' గోపాల గోపాల' సినిమాలకి అలాగే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ, నాగార్జున, నితిన్, బెల్లంకొండ, ఇలా చాలామందితో పని చేశారు గణేష్ మాస్టర్.
ఇప్పుడు విరాట్ ని పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాకి టైటిల్ ని కూడా 'గౌడ్ సాబ్' అని పెట్టారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెపుతున్నారు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతామని చెపుతున్నారు. ఇందులో కథానాయిక పేరు ప్రకటించాల్సి వుంది, అలాగే మిగతా నటీనటుల ఎంపిక కూడా జరగాల్సి వుంది అని చెపుతున్నారు. కొంతమంది సాంకేతిక నిపుణలను ఇప్పటికీ తీసుకున్నట్టుగా తెలిసింది. విరాట్, ప్రభాస్ కి వరసకి సోదరుడు అవుతాడని అంటున్నారు.