Tabu: ఆ సినిమా ఎందుకు అంగీకరించానా అని బాధపడ్డాను!

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:16 PM

టుబు(Tabu) గురించి పరిచయం అక్కర్లేదు. ఒకనొక టైమ్‌లో టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందారు. తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌ బాటపట్టింది.


టుబు(Tabu) గురించి పరిచయం అక్కర్లేదు. ఒకనొక టైమ్‌లో టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందారు. తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌ బాటపట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఓ ప్రాజెక్ట్‌ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

‘‘నటి షబానా అజ్మీ మాకు బంధువు. ఓ సందర్భంలో ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌కపూర్‌ నన్ను చూశారు. నాతో ‘దుష్మణి’ సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇంట్లో వాళ్లతో చెప్పారు. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. చదువుపై ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి రానని చెప్పా. ఆయన చాలాసార్లు అడగడంతో చివరకు అంగీకరించా. పదోతరగతి పరీక్షలు రాసి.. సినిమాకు సంతకం చేశా. ఏమైందో ఏమో తెలియదు. ఆదిలోనే అది ఆగిపోయింది. ఆ తర్వాత అదే చిత్రాన్ని సన్నీదేవోల్‌, మనీషా కొయిరాలాతో  డైరెక్టర్‌ బంటీ తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత శేఖర్‌ మళ్లీ నన్ను కలిశారు. ‘ప్రేమ్‌’లో నటించమని అడిగారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. కాకపోతే ఆయన బలవంతం చేయడంతో అంగీకరించా. షూటింగ్‌ మొదలయ్యాక ఆయన సినిమా నుంచి వైదొలగారు. దాంతో దాదాపు ఐదేళ్లపాటు ఆ ప్రాజెక్ట్‌ చిత్రీకరించారు. ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినందుకు ఎంతో బాధపడ్డా’’ అని టబు చెప్పారు. ఇటీవల క్రూ చిత్రంతో అలరించారు టబు.  

Updated Date - Jul 26 , 2024 | 01:16 PM