నీ విశ్వరూపం చూపావన్నారు
ABN , First Publish Date - 2023-01-13T01:47:03+05:30 IST
‘‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి అద్భుతమైన బాణీలు ఇచ్చావు. ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా నీ విశ్వరూపం చూపావు’ అని చిరంజీవి గారు ప్రశంసించడం...
‘‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి అద్భుతమైన బాణీలు ఇచ్చావు. ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా నీ విశ్వరూపం చూపావు’ అని చిరంజీవి గారు ప్రశంసించడం చాలా ఆనందాన్నిచ్చింది’ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ‘చిరంజీవి గారికి నా మీద ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడానికి చాలా క ష్టపడ్డాను. సినిమా చూశాక ఆయనకు ఫోన్ చేశాను. ‘ఏడిపిస్తూ నవ్వించారు, నవ్విస్తూ ఏడిపించారు’ అన్నాను. ‘ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’ అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ చూశాక కంటతడితో నవ్వుతూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. బాబీ, నేనూ మంచి స్నేహితులం. తను చేసే ప్రతి సినిమాకు సంగీతం అందించమని ముందు నన్నే అడిగేవారు. ‘నువ్వు శ్రీదేవి...’, ‘పూనకాలు లోడింగ్...’ ఇలా ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందడానికి కారణం బాబీ గారు కథ చెప్పిన విధానం, నాపైన ఆయన పెట్టుకున్న నమ్మకం. బాబీ సూచన మేరకే వీరయ్య టైటిల్ సాంగ్ ఒక కొత్తతరహాలో చేశాం. చిరంజీవిగారి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. పాటలు కంపోజ్ చేసేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను.’