ఇప్పుడు హీరో, విలన్ అని లేదు
ABN , First Publish Date - 2023-10-26T01:46:35+05:30 IST
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు చరణ్రాజ్ బుధవారం...

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు చరణ్రాజ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమకి వచ్చా. ఎనిమిదేళ్లు అర్ధాకలితో కష్టపడ్డా. ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కింది. విభిన్న పాత్రలు ఎన్నో పోషించా. నటుడిగా డబ్బు కంటే సంతృప్తినే ఎక్కువగా కోరుకున్నా. రొటీన్ పాత్రలు వస్తుండడంతో తెలుగులో గ్యాప్ ఇచ్చా. కన్నడంలో, మలయాళంలో కొన్ని సినిమాలు ఈ గ్యాప్లో చేశా.
‘నరకాసుర’ కథ, కథనాలు, కొత్తదనం నాకు నచ్చాయి. అందుకే కావాలని వెంటపడి ఈ సినిమా చేశా. దర్శకుడు ఓ కొత్త అప్రోచ్తో సినిమా తీశారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఈ సినిమాలో నేను పాము స్వభావం ఉన్న పాత్రను పోషించా. మంచి వాళ్లకు మంచి వాడిగా, చెడ్డవాళ్లతో చెడ్డ వాడిగా ఉండే పాత్ర ఇది. నా కెరీర్లో చేసిన విభిన్న పాత్రల్లో ఇదొకటి. నాతో పాటు మా అబ్బాయి కూడా ఇందులో నటించాడు.
హీరో రక్షిత్ బాగా నటించాడు. ఈ సినిమా అతనికి యాక్షన్ హీరోగా పేరు తెస్తుంది. చక్కని భవిష్యత్ ఉంది. అతనికి కూడా సినిమాలు అంటే ఎంతో ఇష్టం.
గతంలో విలన్ పాత్రలు వేసే వాళ్లు తక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో, విలన్ అనేది ఇప్పుడు లేదు. సంజయ్దత్, జగపతిబాబు, అర్జున్ లాంటి హీరోలు ఇప్పుడు విలన్లుగా నటిస్తున్నారు. మంచి పాత్ర చేయాలి, ప్రేక్షకుల అభిమానం పొందాలి.. అనేది ఒక్కటే ఇవాళ ప్రతి నటుడికి ఉన్న లక్ష్యం.