వాళ్లిద్దరు కొంతకాలం మాట్లాడుకోలేదు
ABN , First Publish Date - 2023-01-27T23:49:01+05:30 IST
జమున చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజులు. ఒకరోజు షూటింగ్ లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగింది.
జమున చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజులు. ఒకరోజు షూటింగ్ లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగి జమున దగ్గరకు వచ్చి ‘నేను సావిత్రిగారి ఇంటి నుంచి వస్తున్నా. ఆవిడ పత్రికలో మీ ఫొటో చూశారు. తను దుగ్గిరాలలో నాట్య ప్రదర్శన కోసం వచ్చినప్పుడు జమున అనే అమ్మాయిని కలిశాననీ, ఆ జమున మీరే అయితే ఇంటికి తీసుకురమ్మని సావిత్రిగారు కారు పంపారు’ అని చెప్పాడు. సావిత్రి అప్పటికే పెద్ద స్టార్. జమునది ఎదుగుతున్న దశ. ఎప్పుడో జరిగిన సంఘటనని గుర్తు పెట్టుకుని సావిత్రి కబురు చేయడంతో జమున థ్రిల్ ఫీలయ్యారు. తండ్రిని వెంటబెట్టుకుని సావిత్రి ఇంటికి వెళ్లారు జమున. ఆమెను చూడగానే ‘ఓహో నువ్వేనా జమునా’ అని ఆప్యాయంగా కౌగలించుకున్నారు సావిత్రి. చాలా సేపు మాట్లాడుకున్నారు. ‘మిస్సమ్మ’ చిత్రంతో వీరిద్దరి బంధం బలపడింది. సావిత్రిని ‘అక్కా’ అని పిలిచేవారు జమున. చాలా సినిమాల్లో కలసి నటించారు. సావిత్రి దర్శకత్వంలో వహించిన ‘చిన్నారి పాపలు’ చిత్రంలో కూడా జమున నటించారు. అయితే వీరి స్నేహాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇద్దరి మధ్య అపోహలు, అపార్ధాలు సృష్టించారు. ఫలితంగా కొంత కాలం వీరిద్దరి మధ్య మాటలు లేవు. తనకు పెళ్లి కుదిరిన తర్వాత శుభలేఖ ఇవ్వడానికి సావిత్రి ఇంటికి వెళ్లారు. తనని చూడగానే ఏమంటుంది, పెళ్లికి వస్తుందా రాదా అని సందేహిస్తూనే అక్కడికి వెళ్లారు జమున. ఆమెని చూడగానే సావిత్రి ‘చెల్లీ వచ్చావా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు సావిత్రి. శుభలేఖ ఇవ్వగానే ‘నా చెల్లి పెళ్లికి నేను రాకుండా ఉంటానా’ అన్నారు. ఆ తర్వాత పెళ్లికి రావడమే కాదు తనే స్వయంగా జమునని అలంకరించారు.