మనుషులపై నమ్మకం ఇంకా పోలేదు
ABN , First Publish Date - 2023-03-25T03:00:23+05:30 IST
మనవైన అనుబంధాల్ని, మనదైన విలువల్నీ ఓ కథగా వెండి తెరపై ఆవిష్కరించడం కృష్ణవంశీకి బాగా ఇష్టం. అలాంటి ఏ సందర్భాన్నీ ఆయన వదులుకోలేదు. ‘రంగమార్తాండ’లో ఆయన చేసింది అదే...
మనవైన అనుబంధాల్ని, మనదైన విలువల్నీ ఓ కథగా వెండి తెరపై ఆవిష్కరించడం కృష్ణవంశీకి బాగా ఇష్టం. అలాంటి ఏ సందర్భాన్నీ ఆయన వదులుకోలేదు. ‘రంగమార్తాండ’లో ఆయన చేసింది అదే. ‘అమ్మానాన్నల కథ’ అనే ట్యాగ్లైన్తో వచ్చిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంటోంది. కృష్ణవంశీ మార్క్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ ఏం చెప్పారంటే..?
‘‘నాకు మనుషులపై ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే.. తప్పకుండా ఆదరిస్తారని, దాని గురించి మాట్లాడుకొంటారన్నది నా గట్టి ఫీలింగ్. దాన్ని ‘రంగమార్తాండ’ నిజం చేసింది. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం చేసింది లేదు. ప్రీమియర్ షోలు మాత్రం ఏర్పాటు చేశాం. కేవలం మౌత్ టాక్తో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. ‘ఈ సినిమా చూశాక మా అమ్మ గుర్తొచ్చింద’నో, ‘మా నాన్నతో మాట్లాడాలని అనిపిస్తోంద’నో.. చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ‘అమ్మానాన్నల కథ’ అనే ట్యాగ్ లైన్ పెట్టినందుకు పూర్తి న్యాయం జరిగిందనిపించింది’’
‘‘మరాఠీలోని ‘నటసామ్రాట్’ చూసిన ప్రకాశ్ రాజ్.. ‘ఆ సినిమా ఓసారి చూడు. నాకు స్ర్కీన్ ప్లేలో సహాయం చేయ్..’ అన్నాడు. తన కోసం ఆ సినిమా చూశా. కానీ చూసిన తరవాత కన్నీళ్లు ఆపుకోలేకపోయా. నాలాంటి రాక్షసుడితోనే కంటతడి పెట్టించిన సినిమా అది. ఆ తరవాత నాకు తోచిన మార్పులూ.. చేర్పులూ ప్రకాశ్రాజ్తో చర్చించా. అప్పుడే ‘ఈ సినిమాని నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది’ అన్నాడు. అలా.. ఈ సినిమా ప్రయాణం మొదలైంది’’.
‘‘ప్రతీ నటుడిలోనూ విభిన్న కోణాలుంటాయి. వాటిని తెరపై చూపించడం నాకిష్టం. విలన్ పాత్రలు వేసే చలపతిరావు బాబాయ్ని ‘నిన్నే పెళ్లాడతా’లో ఓ మంచి నాన్నగా చూపించా. ఇలాంటి ప్రయోగాలు కొన్ని చేశాను. వర్మ గారి ‘క్షణం క్షణం’లో కూడా బ్రహ్మానందంగారి పాత్ర కొత్తగా, టిపికల్గా ఉంటుంది. ఆయనలోని నటుడ్ని నేనెప్పుడో చూశా. బ్రహ్మానందంగారిని ‘రంగమార్తాండ’లోని చక్రి పాత్రలో ఊహించుకొనే ధైర్యం అందుకే చేశా. 1250 చిత్రాలు చేసిన నటుడాయన. ఈ పాత్ర చెప్పగానే.. చాలా ఉత్సాహం చూపించారు. తొలి సినిమా చేస్తున్నంత శ్రద్ధగా సెట్కి వచ్చేవారు. ఒక్కో సన్నివేశానికి 10, 20 టేకులు చేసేవాళ్లం. అయినా సరే, ఆయన ఓపిగ్గా నటించారు. ఈ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా ఆయనదే’’
‘‘చిరంజీవిగారి వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అయ్యింది. ‘నేనొక నటుడ్ని’ షాహెరీ లక్ష్మీభూపాల్ అద్భుతంగా రాశాడు. ఇళయరాజా సంగీతం, పాటలు ప్రాణం పోశాయి. రమ్యకృష్ణ తన కళ్లతోనే భావాలు పలికించింది. నిజానికి ఈ పాత్రకు తగిన నటి దొరక్క ఇబ్బంది పడుతున్న క్షణంలో ‘నేనే చేస్తా’ అంటూ తానే ముందుకొచ్చింది. శివాత్మిక, రాహుల్, అనసూయ.. వీళ్లంతా ది బెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రేక్షకులు, విమర్శకులు ఈ సినిమాని నెత్తిన పెట్టుకొన్నారు. ఈ విజయం ఇచ్చిన ధైర్యం చాలా గొప్పది. ఇక ముందు కూడా మంచి సినిమాలు చేసే స్ఫూర్తిని నింపింది’’.