సినిమా చూడనివాళ్లకు చెప్పొద్దు
ABN , First Publish Date - 2023-07-19T00:42:42+05:30 IST
‘‘హిడింబ’లో ఒక షాకింగ్ పాయింట్ ఉంది. సినిమా చూసినవాళ్లు ఆ విషయాన్ని చూడని వాళ్లకు చెప్పొద్దు’ అని దర్శకుడు అనిల్ కన్నెగంటి కోరారు...

‘‘హిడింబ’లో ఒక షాకింగ్ పాయింట్ ఉంది. సినిమా చూసినవాళ్లు ఆ విషయాన్ని చూడని వాళ్లకు చెప్పొద్దు’ అని దర్శకుడు అనిల్ కన్నెగంటి కోరారు. అశ్విన్బాబు కథానాయకుడిగా అనిల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయిక. ఈ నెల 20న విడుదలవుతున్న సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడారు.
ఒక హైబ్రీడ్ జానర్లో డిఫరెంట్ మూవీ చేయాలని చాలా కాలంగా ఉంది. ఇప్పటికే కొన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని ప్రేక్షకులు చూశారు. ఏదో కొత్తదనం కావాలంటే గేర్లు మారుస్తూ వెళ్లాలి. ఇంటర్వెల్ తర్వాత జానర్ మారితే కొత్త అనుభూతి వస్తుందని అనిపించింది. ఈ సినిమా చేయడానికి కారణం సెకండ్ హాఫ్. చరిత్రలో ఎక్కడా రాయని కొన్ని విషయాలకు కల్పన జోడించి, ట్రెండ్కు తగ్గట్లు మలిచాం.
ఈ సినిమాలో ఒక తెగ ఉంటుంది. ఆ తెగ హిడింబాసురుడి లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే ‘హిడింబ’ అనే టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో చూపించే హిస్టరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
సినిమా చాలా వరకూ బ్లాక్ అండ్ వైట్, రెడ్లో ఉంటుంది. ఎందుకు అలా కనిపిస్తుందనేది ప్రేక్షకుల్లో కుతూహలాన్ని పెంచుతుంది. కేరళ, అండమాన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎగ్జయిటింగ్గా ఉంటాయి. ‘హిడింబ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అశ్విన్ కటౌట్ సినిమాకు చక్కగా సరిపోయింది.